భారత రోడ్లపై పది లక్షల స్విఫ్ట్ కార్లు..
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్విఫ్ట్ కారు ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, భారత్లో మారుతి సుజుకి 10 లక్షల స్విఫ్ట్ కార్ల అమ్మకాలు రికార్డును చేరుకుంది. భారత్లో విడుదలైన 8 ఏళ్లలో ఈ రికార్డును చేరుకోవటం ఆనదంగా ఉందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
మారుతి సుజుకి 2005లో స్విఫ్ట్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. తొలుత దీన్ని పెట్రోల్ వెర్షన్లో కంపెనీ విడుదల చేసింది. అప్పట్లో ఇందులో 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించారు. దాదాపు రెండేళ్ల తర్వాత, అంటే 2007లో స్విఫ్ట్ డీజిల్ వెర్షన్ను మారుతి సుజుకి విడుదల చేసింది. అప్పటి మార్కెట్ పరిస్థితులను బట్టి నెలకు 5,000 యూనిట్లను విక్రయించాలనుకోవడమే పెద్ద లక్ష్యమని మారుతి సుజుకి ఇండియా ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయాంక్ పారీక్ వెల్లడించారు.

అప్పట్లో ప్రీమియం హ్యాచ్బ్యాక్లకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు స్విఫ్ట్ నెలకు సగటున 16,000-17,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోతూ, భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో తృతీయ స్థానంలో నిలిచింది. భారత మార్కెట్లో మారుతి సుజుకికి ఆల్టో తర్వాత స్విఫ్ట్ కారే బెస్ట్ సెల్లింగ్ మోడల్గా ఉంది. దేశీయ విపణిలో ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.
మన మార్కెట్లో స్విఫ్ట్ ధరలు రూ.4.5 లక్షల నుంచి రూ.6.7 లక్షల రేంజ్లో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా స్విఫ్ట్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. మొత్తమ్మీద ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే, ఈ ఎనిమిదేళ్ల కాలంలో స్విఫ్ట్ అమ్మకాలు 30 లక్షల మార్కును అధిగమించాయి. ఇందులో ఎక్కువ భాగం అమ్మకాలు భారత్ నుంచే రావటం విశేషం. చిన్న కార్లకు, అధిక మైలేజీనిచ్చే డీజిల్ కార్లకు డిమాండ్ పెరగటం వలనే ఈ మోడల్ అమ్మకాలు ఇంత భారీ స్థాయిలో జోరందుకున్నాయి. Topics:


Click it and Unblock the Notifications








