సిఎన్జి వేరియంట్ ఎర్టిగాని విడుదల చేయనున్న మారుతి
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ 'ఎర్టిగా' ఎమ్పివిలో ఓ సిఎన్జి వేరియంట్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశీయ విపణిలో సిఎన్జితో నడిచే వాహనాలకు డిమాండ్ అధకమవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు నెలల్లో ఇందుకు సంబంధించి, మారుతి సుజుకి నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడే ఆస్కారం ఉంది.
సిఎన్జితో నడిచే వాహనాలు అధిక మైలేజీనివ్వటమే కాకుండా, పర్యావరణ సాన్నిహిత్యమైనవి కూడా. సరసమైన ధరకే విశిష్టమైన ప్రయోజనాలతో లభిస్తున్న మారుతి సుజుకి ఎర్టిగాకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఇది మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో, ఇందులో సిఎన్జి వేరియంట్ను ప్రవేశపెట్టడం ద్వారా ఎర్టిగా అమ్మకాలకు మరింత ఊతమివ్వాలని మారుతి సుజుకి యోచిస్తోంది.

ప్రతినెలా 1,000-1,500 ఎర్టిగా సిఎన్జి వేరియంట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకోనుంది. ప్రతినెలా సగటున 5,000-6,000 యూనిట్ల ఎర్టిగాలను కంపెనీ విక్రయిస్తోంది. ప్రస్తుతం దేశయ ఆటోమొబైల్ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో, సిఎన్జి వేరియంట్ విడుదల ద్వారానైనా కంపెనీ అమ్మకాలు జోరందుకుంటాయో లేదా వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో మాత్రమే లభ్యమవుతోంది.
ఇందులో తొలిసారిగా మారుతి సుజుకి అభివృద్ధి చేసిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 95 పిఎస్ల శక్తిని, 130 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్కు 16.02 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఇక డీజిల్ వేరియంట్ ఎర్టిగా విషయానికి వస్తే, ఇందులో అమర్చిన 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్టర్బో విజిటి డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్ల శక్తిని, 200 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్కు 20.77 కి.మీ. మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








