డీజిల్ కార్ల ఉత్పత్తిని తగ్గించిన మారుతి సుజుకి
గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టడంతో తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా తమ వివాదాస్పద మానేసర్ ప్లాంటులో ఉత్పత్తిని భారీగా తగ్గించింది. వాహనాలకు డిమాండ్ తగ్గుతుండటంతో కంపెనీ డీజిల్ ఇంజన్ల ఉత్పత్తని కూడా తగ్గించింది.
ఇందులో భాగంగానే మానేసర్ ప్లాంటులో మూడో షిఫ్టు కార్యకలాపాలను కంపెనీ నిలిపివేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ షిఫ్టులో పనిచేసే దాదాపు 200 మంది కాంట్రాక్టు సిబ్బందికి కూడా కంపెనీ నిరవధిక సెలవును ప్రకటించినట్లు తెలుస్తోంది. డీజిల్ కార్లకు డిమాండ్ మందగించిన నేపథ్యంలో డీజిల్ ఇంజన్ల ప్లాంటుకి సంబంధించి కొన్ని మార్పులు చేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
డీజిల్ కార్లకు గిరాకీ తగ్గటానికి ప్రధాన కారణం, గడచిన కొద్ది నెలలుగా డీజిల్ ఇంధన ధరలు ప్రతినెలా పెరుగుతుండటమే. గడచిన జనవరి నెల నుంచి డీజిల్ ధరలు ప్రతినెలా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో డీజిల్ కార్లను కొనుగోలుచేసే వారు ఒకటి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. గడచిన నెలలో కూడా కంపెనీ మొత్తం అమ్మకాలు ఏకంగా 12.6 శాతం క్షీణించాయి.
ఈ ప్లాంటులో ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ వంటి డీజిల్ కార్లు ఉత్పత్తి అవుతాయి. గిరాకీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో కంపెనీ అందిస్తున్న దాదాపు అన్ని మోడళ్ల ఉత్పత్తిని తగ్గించివేసినట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications








