అక్టోబర్ నుంచి పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు
పండుగ సీజన్లో డిస్కౌంట్లను ఆఫర్ చేసి కొనుగోలుదారులను ఆకట్టుకోవాల్సిన కార్ల తయారీ కంపెనీలు, ధరాఘాతంతో వారిని బెంబేలెత్తిస్తున్నారు. ఇతర కార్ల తయారీదారుల బాటలోనే, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా కూడా వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. రూపాయి విలువ పతనం వల్ల అన్ని రకాల మోడల్ కార్ల ధరలను సుమారు రూ.10,000 మేర పెంచనున్నామని కంపెనీ సీఓఓ మయాంక్ పారీఖ్ తెలిపారు.
అయితే, ఏయే మోడల్పై ఎంత మేర పెంపు విధిస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అక్టోబర్ మొదటి వారంలో పెంపు నిర్ణయాన్ని వెల్లడిస్తామని, ఈ పెంపు మోడల్ను బట్టి రూ.3000 నుంచి రూ.10,000 వరకు ఉంటుందని ఆయన తెలిపారు. రూపాయి విలువ గణనీయంగా తగ్గిన కారణంగా ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోయిందని, ధరల పెంపు ప్రతిపాదన చాలా కాలంగా పరిశీలనలో ఉన్నప్పటికీ, మార్కెట్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తూ వచ్చామని ఆయన అన్నారు.

మారుతి సుజుకి ఈ ఏడాది ఆరంభంలో కూడా ధరలను పెంచింది. దేశీయ విపణిలో మారుతి సుజుకి విక్రయిస్తున్న మోడల్ల ధరలు రూ.2.35 లక్షల నుంచి రూ.10.21 లక్షల రేంజ్లో ఉన్నాయి. కాగా.. ఇప్పటికే హ్యుండయ్ మోటార్ ఇండియా, జనరల్ మోటార్స్ ఇండియా కూడా ఈ నెల ఆరంభంలోనే ధరల పెంపును ప్రకటించగా, దేశీయ ఆటో టాటా మోటార్స్ కూడా ధరల పెంపు ప్రతిపాదనతో వడ్డింపు సిద్ధంగా ఉంది. టయోటా కిర్లోస్క్ మోటార్స్ కూడా ఇటీవలనే మోడల్ను బట్టి ధరలను సుమారు రూ.24,000 మేర ధరలను పెంచింది.


Click it and Unblock the Notifications








