అప్డేటెడ్ బొలెరో పికప్ను విడుదల చేసిన మహీంద్రా
ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న బొలెరో పికప్లో కంపెనీ ఓ అప్డేటెడ్ వెర్షన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ కొత్త మహీంద్రా బొలెరో పికప్ ప్రారంభ ధరను రూ.5.45 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ కొత్త పికప్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని, ఇది 1,250 కిలోల లోడ్ను తీసుకెళ్ళగలదని, ఇంధన ఆదా కోసం ఇందులో మైక్రో హైబ్రిడ్ ఫ్యూయల్ టెక్నాలజీని ఉపయోగించామని కంపెనీ వివరించింది. కొత్త బొలెరో పికప్లో 63 హెచ్పి శక్తిని, 195 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఎమ్డిఐ డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు.

అప్డేటెడ్ మహీంద్రా బొలెరో పికప్ లీటరు డీజిలుకు 14 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తుందని, ఇది 3 ఏళ్ళ అపరిమిత వారంటీతో లభిస్తుందని కంపనీ పేర్కొంది. ఆకర్షణీయమైన డ్యుయల్ టోన్ ఇంటీరియర్స్తో సౌకర్యవంతమైన సీటింగ్ (హెడ్ రెస్ట్తో కూడిన ఫ్యాబ్రిక్ సీట్స్) వంటి విశిష్టమై ఫీచర్లతో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది.
మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమిటి...?
మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీనే ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. వాహనంలో ఈ సిస్టమ్ను అమర్చడం వలన ఇంజన్ ఐడిల్గా ఉండటాన్ని ఇది గుర్తించి ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయ్యేలా చేస్తుంది. మళ్లీ తిరిగి క్లచ్ను నొక్కగానే ఇంజన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. లాంగ్ ట్రాఫిక్ జామ్స్, ఎక్కువ సేపు ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి ప్రాంతాల్లో ఇంజన్ను ఐడిల్గా ఉంచుతాం. ఇలాంటి సమయాల్లో ఇంధనం వృధాగా ఖర్చు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజన్ ఐడిల్గా ఉండటాన్ని గుర్తించి నిర్ధిష్ట సమయం తర్వాత ఇంజన్ ఆఫ్ అయ్యేలా చేసి ఇంధనం ఆదా చేస్తుంది. ఈ టెక్నాలజీ వలన కేవలం ఇంధనం ఆదా కావటమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది.


Click it and Unblock the Notifications








