2016 వరకు మహీంద్రా నుంచి సరికొత్త కార్లు రావు
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా 2016 వరకు ఎలాంటి సరికొత్త ఉత్పత్తులను విడుదల చేసే యోచనలో లేదు. కంపెనీ అధ్యక్షుడు పవన్ గోయెంకా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాము విడుదల చేయాలనుకున్న సరికొత్త ఉత్పత్తులనన్నీ గడచిన రెండేళ్లలో విడుదల చేసేశామని, ఇక కొత్త ఉత్పత్తులను 2016లో మాత్రమే విడుదల చేస్తామని పేర్కొన్నారు.
అయితే, ఈలోపు ప్రస్తుతం ఉన్న మోడళ్లలో అప్గ్రేడెడ్ వెర్షన్లను, కొత్త ఫ్యూయెల్ ఆప్షన్లను ప్రవేశపెట్టడం యధావిధిగా కొనసాగుతుందని ఆయన వివరించారు. గడచిన రెండేళ్లుగా గమనిస్తే, మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లో ఎక్స్యూవీ500 ఎస్యూవీ, క్వాంటో కాంపాక్ట్ ఎస్యూవీ, ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు, వెరిటో సెడాన్, వెరిటో వైబ్ కాంపాక్ట్ కార్, శాంగ్యాంగ్ రెక్స్టన్ లగ్జరీ కార్లను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో, రానున్న రోజుల్లో మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి స్కార్పియో, బొలెరో ఎస్యూవీలలో రిఫ్రెష్డ్ వెర్షన్లు, వెరిటోలో ఎలక్ట్రిక్ వేరియంట్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లపై భారత ప్రభుత్వం ప్రత్యక్ష నగదు సబ్సిడీ ఆఫర్ చేస్తేనే కంపెనీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహీంద్రా ప్రవేశపెట్టిన ఈ2ఓ విషయంలో ఈ సబ్సిడీ ఉపసంహరణ కారణంగా, కంపెనీ దీనిని అధిక ధరకు విక్రయించాల్సి వస్తోంది. ఫలితంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు.



Click it and Unblock the Notifications








