భారత్ నుంచి మాయం కానున్న మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్
భారతదేశపు తృతీయ అగ్రగామి లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న ఆర్-క్లాస్ లగ్జరీ ఎమ్పివి ఇక కనుమరుగు కానుంది. భారత లగ్జరీ కార్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్ ఎమ్పివి అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. ప్రస్తుతం కంపెనీ ఈ మోడల్ను సిబియూ రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన ఉత్పత్తిని భారత్కు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. దీంతో దీని ధరక కూడా అధికంగా ఉండటంతో ఈ మోడల్ అమ్మకాలు స్తబ్ధుగా ఉన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్లో మెర్సిడెస్ బెంజ్ విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా 2010లో తమ ఆర్-క్లాస్ను భారతీయులకు పరిచయం చేసింది. 7-సీటర్ ఆప్షన్తో లభించే ఈ లగ్జరీ ఎమ్పివిని ఎమ్-క్లాస్ మరియు జిఎల్-క్లాస్ లకు మధ్యలో కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది ప్రపంచం మొత్తానికి ఒకే ఒక ప్రాంతంలో ఉత్పత్తి అవుతుంది. మెర్సిడెస్ బెంజ్ తమ ఆర్-క్లాస్ను అమెరికాలోని అలబామాలో ఉన్న టస్కలూసా ప్లాంటులో ఉత్పత్తి చేస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా తొలుత తమ ఆర్-క్లాస్ను పెట్రోల్ ఇంజన్ (3.5 లీటర్ వి6) ఆప్షన్తో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇందులో డీజిల్ ఇంజన్ (3.0 లీటర్ వి6) కలిగిన వేరియంట్ను విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధర రూ.70 లక్షలకు పైమాటే. అందుకే కొనుగోలుదారులు ఈ మోడల్ను కొనాలంటే జేబులను ఒకటి నాలుగు సార్లు తడిమి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఆర్-క్లాస్ ఎమ్పిని భారత్ నుంచి తొలగించాలని మెర్సిడెస్ భావిస్తోంది. అంతేకాదు, ఇప్పట్లో ఈ మోడల్పై ఓ కొత్త వెర్షన్ మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు.



Click it and Unblock the Notifications








