మహీంద్రా రేవా కొత్త ఎలక్ట్రిక్ కారు పేరేంటో తెలుసా..?
మహీంద్రా గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా రేవా తమ నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ రెడీ, ఎలక్ట్రిక్ కారుకు 'మహీంద్రా ఈ2ఓ' (Mahindra e2o) అనే పేరును ఖరారు చేస్తున్న ఓ ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా ఈ2ఓ (ఈ టూ ఓ అని పలకాలి)ను క్లీన్, కన్వీనెంట్, కనెక్టెడ్, క్లెవల్, కాస్ట్ ఎఫెక్టివ్ అనే ఐదు సూత్రాలను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసింది. వివిధ దశల్లో టెస్టింగ్ను పూర్తి చేసుకున్న మహీంద్రా ఈ2ఓ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ కారును మహీంద్రా బెంగుళూరులో తాజాగా ఏర్పాటు చేసిన అధునాతన ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్లాటినం సర్టిఫికెట్ పొందిన ఈ ఆటోమొబైల్ ప్లాంటులో ఏటా సుమారు 30,000 ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి కానున్నాయి. ప్రకృతి ఏవిధంగాను హాని కలిగించని రీతిలో ఈ ఎకో ఫ్రెండ్లీ కారును మహీంద్రా రేవా తయారు చేసింది. మహీంద్రా ఈ2ఓ పేరులో ఈ అనే అక్షరం సూర్యుని శక్తిని, 2 (టూ) కారులో కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని, ఓ అనే అక్షరం ఆక్సిజన్ను ప్రతిభింభింపజేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన నెక్స్ట్ జనరేషన్ లిథియం అయాన్ బ్యాటరీలను (మొబైల్ ఫోన్లలో ఉపయోగించే రకం) ఉపయోగించారు. ఈ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలను ఇంటి వద్ద కానీ లేదా పనిచేసే చోట కానీ ఏ 15 ఆంపియర్ ప్లగ్ సాయంతోనైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత సర్కారు వెల్లడించనున్న బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు భారీ ప్రోత్సాహకాలు అందించనున్న నేపథ్యంలో, మహీంద్రా ఈ2ఓ కారును బడ్జెట్ వెల్లడైన తర్వాత మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








