తవేరా రీకాల్ వలన జిఎమ్ ఇండియాకు రూ.500 కోట్లు నష్టం
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయించిన చెవర్లే తవేరా మోడళ్లలో కాలుష్య నిబంధనల సమస్యల వలన 1.14 లక్షల తవేరా ఎమ్పివిలను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తవేరా రీకాల్ వలన జనరల్ మోటార్స్ ఇండియాకు సుమారు 500 కోట్ల రూపాయల నష్టం వాటిళ్లనున్నట్లు సమాచారం.
ఈ మొత్తంలో సుమారు రూ.285 కోట్లు భారతదేశ కాలుష్య నిబంధనలకు అనుగుణంగా (బిఎస్3, బిఎస్4) డీజిల్ ఇంజన్లను మార్పు చేసేందుకు ఖర్చు కానున్నాయి. ఇకపోతే కాలుష్య నిబంధనలను తప్పుగా చూపించినందుకు గాను సెంట్రల్ మోటార్ వాహన చట్టాల ప్రకారం, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు రూ.11 కోట్లు పెనాల్టీ చెల్లించే ఆస్కారం ఉందని అధికారిక టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.

ఈ సమస్య గురించి తెలుసుకున్న వెంటనే జనరల్ మోటార్స్ ఇండియా ప్రస్తుత చెవర్లే తవేరా ఉత్పత్తిని, అమ్మకాలను నిలిపి వేసింది. దీంతో గడచిన జూన్, జులై నెలల్లో ఒక్క తవేరా కూడా అమ్ముడుపోలేదు, ఫలితంగా దాదాపు రూ.200 కోట్ల ఆదాయ నష్టం వాటిళ్లినట్లు సమాచారం. జనరల్ మోటార్స్ ఇండియా ప్రతినెలా సగటున 1,700 తవేరాలను విక్రయిస్తుంది. ప్రతి తవేరా అమ్మకంపై సుమారు రూ.6 లక్షల ఆదాయం లభిస్తుంది. భారత మార్కెట్లో తవేరా ధరలు రూ.6.89 లక్షల నుంచి రూ.10.93 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయి.
మొత్తమ్మీద చూసుకుంటే, చెవర్లే తవేరా రీకాల్ జనరల్ మోటార్స్ ఇండియాకు భారీ నష్టాలను మిగిల్చనుంది. ఇదిలా ఉండగా, తవేరా రీకాల్తో భారత టెస్టింగ్ ఏజెన్సీ అప్రమత్తం అయింది. అన్ని వాహనాల్లో విషయాల్లో ఎక్కువ సార్లు తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒకరంగా ఇది ఆహ్వానించదగినదే, ఇలా చేయటం వలన కార్ల తయారీదారులు అప్రమత్తమై, లోపపూరిత వాహనాల ఉత్పత్తిని భారీగా తగ్గించే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








