చెవర్లే తవేరా రీకాల్ ఎఫెక్ట్: 35 మంది ఉద్యోగులపై వేటు
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయించిన చెవర్లే తవేరా ఎమ్పివిలో కాలుష్య నిబంధనల సమస్యలు తెలత్తిన నేపథ్యంలో, వీటిని రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ లోపాలు కంపెనీలోని అంతర్గత కారణాల వల్లే జరిగాయని జనరల్ మోటార్స్ గుర్తించింది. ఈ విషయంలో జనరల్ మోటార్స్ యూఎస్ హెడ్క్వార్టర్స్లోని సీనియర్ ఆర్ అండ్ డి అధికారులు పదవుల నుంచి తప్పుకున్న తర్వాత భారత ప్లాంటులోని ఉద్యోగులపై కూడా వేటు పడింది.
భారత్లో కార్యకాలాపాలు నిర్వహిస్తున్న 30-35 మంది కీలక ఎగ్జిక్యూటివ్లను కంపెనీ విధుల నుంచి తొలగించి వేసింది. మహారాష్ట్రలోని తాలేగావ్, గుజరాత్లోని హలోల్ ప్లాంట్ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని కార్పోరేట్ ఆఫీసులలో ఉన్న డజన్ల కొద్ది అధికారులపై కంపెనీ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఓ ప్రముఖ ఆంగ్రపత్రిక జనరల్ మోటార్స్ ఇండియా ప్రతినిధి ఒకరిని సంప్రదించగా, కంపెనీ పాలసీ ప్రకారం ఈ విషయంపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని ఆయన సదరు ప్రతినిధి తెలిపారు.

భారత మార్కెట్లో 2005వ సంవత్సరం నుంచి 2013వ సంవత్సర మధ్య కాలంలో విక్రయించిన, సుమారు లక్ష యూనిట్లకు పైగా చెవర్లే తవేరా వాహనాలలో కాలుష్య నిబంధనల సంబంధిత సమస్యలను గుర్తించామని, అందుకే వాటిని వెనక్కు పిలిపిస్తున్నామని జనరల్ మోటార్స్ గతంలో ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసినదే. చెవర్లే ఎమ్పివిలలో ఎమిషన్స్, స్పెసిఫికేషన్ సమస్యలకు సంబంధించి జనరల్ మోటార్స్ ఈ రీకాల్ను జారీ చేసింది.
భారతదేశంలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు చేసిన అతిపెద్ద రీకాల్లలో చెవర్లే తవేరా రీకాల్ కూడా ఒకటి కావటంతో కంపెనీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యల కారణంగా జనరల్ మోటార్స్ ఇప్పటికే తవేరా ఉత్పత్తి నిలిపి వేసింది. తవేరా భారత్ స్టేజ్ 3 (2.5 లీటర్ వేరియంట్)లో ఎమిషన్ (కాలుష్య) సమస్యలు, తవేరా బిఎస్ 4 (2.0 లీటర్ వేరియంట్)లో స్పెసిఫికేషన్ సమస్యలు ఉన్నట్లు జనరల్ మోటార్స్ వివరించింది.


Click it and Unblock the Notifications








