మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి త్వరలోనే మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫోర్-వీలక్ 'మహీంద్రా ఈ2ఓ'ను విజయవంతంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావటంపై కంపెనీ దృష్టి సారించింది. మహీంద్రా అందిస్తున్న జియో, మాక్సిమో పికప్ ట్రక్కులు మరియు వెరిటో సెడాన్లలో ఎలక్ట్రిక్ వెర్షన్లను అభివృద్ధి చేసేందుకు కంపెనీ సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది.
ఎలక్ట్రిక్ వెర్షన్ జియో, మాక్సిమో పికప్లు విడుదలకు దాదాపు సిద్ధంగా ఉన్నాయని, వెరిటో ప్రోటోటైప్ను తయారు చేశామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్) పవన్ గోయెంకా వెల్లడించారు. మహీంద్రా రేవా విడుదల చేసిన ఈ2ఓ ఎలక్ట్రిక్ కారుకు లభిస్తున్న మార్కెట్ స్పందనను ప్రస్తుతం కంపెనీ అంచనా వేస్తోంది. ఇది పూర్తియిన తర్వాత మరో ఏడాది లోపుగా ఎలక్ట్రిక్ వెర్షన్ జియో, మాక్సిమోలను విడుదల చేసే ఆస్కారం.
ఇప్పటికే 50 యూనిట్ల ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా మాక్సిమో పికప్లను విక్రయించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారి ఇందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, వీటిని మనం రోడ్లపై చూడొచ్చు. అయితే, ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా వెరిటో సెడాన్ విడుదలకు మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 2012లో ఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ మోటార్ షోలో తమ ఎలక్ట్రిక్ వెర్షన్ వెరిటోను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.



Click it and Unblock the Notifications








