అక్టోబర్ నెలలో ధరలను పెంచనున్న టొయోటా
పండుగ సీజన్లో కార్ల ధరలు తగ్గడం మాటేమో కానీ, పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. విలువ పడిపోవటం రోజురోజుకి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న రూపాయి, కార్ల కంపెనీల పాలిట శాపం మారుతోంది. ఇప్పటికే ఈనెలలో కొన్ని కార్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించగా, తాజాగా జపనీస్ కార్ కంపెనీ టొయోటా కూడా ఇదే బాటలో అక్టోబర్ నెల నుంచి ఉత్పత్తుల ధరలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది.
రూపాయి విలువ పతనం ఇలానే కొనసాగితే, అక్టోబర్ నెల నుంచి తాము ఉత్పత్తుల ధరలను పెంచే ఆస్కారం ఉందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ కమర్షియల్) సందీప్ సింగ్ తెలిపారు. కంపెనీ ఇటీవలే ఫార్చ్యూనరల్ ఎస్యూవీ, క్యామ్రీ సెడాన్ కార్ల ధరలను 1 శాతం మేర పెంచినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ (సియామ్) వార్షిక సమావేశం అనంతరం విలేఖరులకు వివరించారు.
రుపాయి విలువకు బలం చేకూర్చేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళికలపై ఆయన స్పందిస్తూ.. ఇంత వరకూ అలాంటి ప్రణాళికలు ఏవీ జరగలేదని, వాళ్లు (ప్రభుత్వం) కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తున్నారని, కానీ అవి అమల్లోకి మాత్రం రావటం లేదని సందీప్ సింగ్ అన్నారు. రుపాయి విలువ క్షీణత, అధిక వడ్డీ రేట్లు వంటి పలు అంశాలు కంపెనీ వృద్ధికి ఆటంకాలని, వీట వలన భవిష్యత్తులో పెద్ద వృద్ధిని సాధించడం కష్టమేనని చెప్పారు.



Click it and Unblock the Notifications








