బస్ ప్రయాణికుల కోసం రూ.20 లకే ప్రయాణ బీమా పాలసీ

కేవలం రూ.20 చెల్లించి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆఫర్ చేస్తుంది. ఈ మేరకు ఐసిఐసిఐ లాంబార్డ్, అభిబస్ డాట్ కామ్తో చేతులు కలిపింది. టికెట్ ధర ఎంతైనా, ఏ రూటులో ప్రయాణించినా రూ.20 చెల్లించి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చని ఐసిఐసిఐ లాంబార్డ్ తెలిపింది.
దురదృష్టవశాత్తు, ప్రయాణంలో ప్రమాదం సంభవిస్తే రూ.1.5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులను కంపెనీ భరిస్తుందని, ఒకవేళ పర్సనల్ యాక్సిడెంట్ జరిగితే రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుందని ఐసిఐసిఐ లాంబార్డ్ పేర్కొంది. హాస్పిటల్లో చేరిన సమయంలో అదనంగా గరిష్ఠంగా ఏడు రోజుల వరకు అలవెన్సుల కింద రోజుకు రూ.500 రూపాయలు కూడా చెల్లించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణంలో ఊహించని ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులపై వైద్య ఖర్చుల భారం పడకుండా ఉండేందుకు ప్రయాణ బీమా పాలసీ చక్కగా ఉపయోగపడుతుందని అభిబస్ డాట్ కామ్ వ్యవస్థాపక సీఈఓ సుధాకర్ రెడ్డి చెప్పారు. దేశంలోని 35 అతిపెద్ద ప్రైవేటు బస్ ఆపరేటర్లు, నాలుగు రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు, రెండు అంతర్జాతీయ ఆపరేటింగ్ సంస్థలతో కలిసి తమ సంస్థ పని చేస్తోందని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








