జనవరిలో 2.5 శాతం పెరగనున్న ఫోక్స్వ్యాగన్ కార్ల ధరలు
జనవరి 2014లో కార్ల ధరలను పెంచనున్న కంపెనీల జాబితాలోకి తాజాగా జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్వ్యాగన్ వచ్చి చేరింది. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోవాల్సిందిపోయి, ధరఘాతంతో కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి కార్ల కంపెనీలు. ఇప్పటికే, దాదాపు అన్ని కార్ల తయారీ కంపెనీలు ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే.
గడచిన కొద్ది నెలలుగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూ వస్తున్నాయని, ఇందులో చాలా వరకు తాము భరించామని, ఇప్పుడు వేరే మార్గం లేక అందులో కొంత భారాన్ని వినియోగదారులపై మోపాలనుకుంటున్నామని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా తెలిపారు. అత్యున్నత ప్రమాణాలున్న వాహనాలను అందించాలంటే ధరలను స్వల్పంగా పెంచక తప్పదని ఆయన చెప్పారు.

ఈ మేరకు వచ్చే నెల నుంచి ఫోక్స్వ్యాగన్ కార్ల ధరలు మోడల్ను బట్టి 1 శాతం నుంచి 2.5 శాతం మేర పెరగనున్నాయి. ప్రస్తుతం ఫోక్స్వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో పోలో హ్యాచ్హబ్యాక్, వెంటో మిడ్-సైజ్ సెడాన్, జెటా ప్రీమియ సెడాన్, పస్సాట్ లగ్జరీ సెడాన్, ఫేటాన్ లగ్జరీ సెలూన్, టోరెగ్ ప్రీమియం ఎస్యూవీలను విక్రయిస్తోంది.
కాగా.. ఇప్పటికే జనవరి 2014 కార్ల ధరలను పెంచనున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, రెనో ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలతో పాటుగా బిఎమ్డబ్ల్యూ ఇండియా, ఆడి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా కంపెనీలు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








