వోల్వో బస్ యాక్సిడెంట్: డీజిల్ ట్యాంక్లోకి దూసుకెళ్లిన రాడ్డు!
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం, పాలెం గ్రామం వద్ద అగ్నికి అహుతైన జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు యాక్సిడెంట్ విషయంలో క్లూస్ టీమ్ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో డ్రైవర్ కల్వర్ట్ను డీకొట్టడంతో రెయిలింగ్ రాడ్ డీజిల్ ట్యాంక్కు గుచ్చుకొని, ట్యాంకుకు రంధ్రం పడిందని, బహుశా అందుకే ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని వారు తెలిపారు.
గడచిన మంగళవారం బెంగుళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న జబ్బార్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురై, బస్సులో మంటలు చెలరేగటంతో సుమారు 45 మందికి క్షణాల్లో అగ్నికి ఆహుతైన సంగతి తెలిసినదే. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు ఇటు సిఐడి టీమ్, అటు వోల్వో ఇంజనీర్ల టీమ్లు దర్యాప్తు చేస్తున్నాయి.

డీజిల్ ట్యాంక్ పేలి ఉండటం వల్లనే మంటలు శరవేగం వ్యాపించి ఉంటాయని, అందుకే ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రాధమిక విచారణలో అధికారులు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా క్లూస్ టీమ్ కూడా అదే విషయాన్ని వెల్లడించడంతో ఈ అనుమానం మరింత బలపడుతోంది. అయితే, వోల్వో ప్రతినిధులు డీజిల్ ట్యాంక్ పేలే ఆస్కారం లేదని, అది ధృడమైన లోహంతో తయారు చేయబడిందని చెప్పుకొస్తున్నారు.
ఇదిలా ఉండగా... ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం సోమవారం బెంగళూరుకు చేరుకొని, అక్కడి జబ్బార్ టావెల్స్ ప్రధాన కార్యాలయంలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన రోజు బస్సులో 12 మూటల వెంట్రుకల (ఫ్యాషన్ విగ్గులు)ను, ఆరు క్యాన్ల కెమికల్స్ రవాణా చేస్తున్నట్లు వారి విచారణలో తేలినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








