హైదరాబాద్లో హెల్మెట్, సీట్-బెల్ట్ నిబంధనలు కఠినతరం!
హైదరాబాద్: హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో కొత్త సంవత్సరంలో వీటి సంఖ్యను తగ్గించేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించేలా, అలాగే కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకునేలా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు.
అధికారిక గణాంకాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించి వారి సంఖ్య 2011లో 441 గా ఉండగా అది 2012లో 462 (డిసెంబర్ 28 వరకూ)కు పెరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని శర్మ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు గాను, తొలుత తాము అవగాహన కార్యక్రమాలను ప్రారంభిస్తామని, అనంతరం వీటిపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామని శర్మ మీడియాకు వివరించారు.

Source: Hyderabad Traffic Police


Click it and Unblock the Notifications








