మారుతి సుజుకి నుంచి చవకైన హైబ్రిడ్ కార్స్!
ప్రస్తుతం మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) కూడా సరసమైన ధరకే హైబ్రిడ్ కార్లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో వివిధ కార్ మేకర్లు విక్రయిస్తున్న హైబ్రిడ్ కార్లన్నీ కూడా అత్యధిక ధరను కలిగి ఉండి, సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి తమ బడ్జెట్ కార్ బ్రాండ్లలోనే హైబ్రిడ్ వెర్షన్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
భవిష్యత్ రవాణా మరియు పర్యవరణ కాలుష్యాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ వీటిని అభివృద్ధి చేయనుంది. సాధారణంగా హైబ్రిడ్ కార్లు నార్మల్ పెట్రోల్/డీజిల్ కార్ల కన్నా అధిక మైలేజీనిస్తాయి. వాటితో పోల్చుకుంటే, హైబ్రిడ్ కార్ల మైలేజ్ 20-30 శాతం పెరుగుతుంది.

అంతేకాకుండా, హైబ్రిడ్ కార్లు రెగ్యులర్ కార్లతో పోల్చుకుంటే తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తాయి. మరోవైపు ఈ కార్లు మోడ్రన్ (బ్రేక్స్ వేసినప్పుడు బ్యాటరీలు చార్జ్ కావటం మొదలైన) టెక్నాలజీని కూడా కలిగి ఉంటాయి.
ఏదేమైనప్పటికీ, మారుతి సుజుకి వంటి మాస్ ప్రొడక్షన్ కార్ కంపెనీ హైబ్రిడ్ కార్ల ఉత్పత్తిని చేపడితే, అవి అత్యంత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.
మారుతి సుజుకి ఇప్పటికే ఏఎమ్టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) సిస్టమ్ను పరిచయం చేసి, అత్యంత చవక ధరకే ఆటోమేటిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చి, మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్ను సృష్టించింది. అలాగే, చవక హైబ్రిడ్ కార్ల తయారీలో కూడా మారుతి సుజుకి ఓ కొత్త ట్రెండ్ సృష్టించాలని మనం కూడా కోరుకుందాం.


Click it and Unblock the Notifications








