వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న బిఎమ్డబ్ల్యూ
'వైర్లెస్ చార్జింగ్'.. ఈ టెక్నాలజీ ఇప్పటికే మొబైల్స్ రంగంలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసినదే. దాదాపు చాలా వరకు ప్రీమియం స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ఈ టెక్నాలజీతో తయారవుతున్నాయి. అయితే, తాజాగా ఈ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ మొబైల్స్ నుంచి ఆటోమొబైల్స్కి కూడా దగ్గర కానుంది.
రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఎలాంటి వైర్లు అవసరం లేకుండా చార్జ్ చేసుకునేలా పరిశోధనలు జరుగుతున్నాయి. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్డబ్ల్యూ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయటం కోసం వైర్లెస్ చార్జింగ్ సిస్టమ్ను బిఎమ్డబ్ల్యూ, డైమ్లర్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.

ఈమేరకు ఇరు సంస్థలు జాయింట్ వెంచర్గా ఏర్పడ్డాయి. వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, బిఎమ్డబ్ల్యూ అందిస్తున్న ఐ8 కారు కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది.
బిఎమ్డబ్ల్యూ తెలిపిన సమాచారం ప్రకారం, ఈ సిస్టమ్లో రెండు కాయిల్స్ ఉంటాయి. ఇందులో ఒకటి కారులో ఉంటుంది, మరొకటి నేలలో బేస్ ప్లేట్కు అమర్చబడి ఉంటుంది. ఇది దాదాపు 90 శాతం వరకు సమర్థవంతంగా 3.6 కి.వా. రేటు వద్ద విద్యుత్ను వైర్ల సాయం అవసరం లేకుండా, ప్రత్యామ్నాయ అయస్కాంత క్షేత్రం ద్వారా కారులోని బ్యాటరీలకు బదిలీ చేస్తుంది.

ఎలక్ట్రిక్ కార్లను వైర్లెస్ చార్జింగ్ చేయటం కోసం డ్రైవర్లు చేయాల్సిందల్లా తమ కారును బేస్ ప్లేట్పై సరైన స్థానంలో పార్క్ చేయటమే. ఈ ప్రక్రియను వై-ఫై సాయంతో పర్యవేక్షించవచ్చు. కారులోని ఒక్క బటన్ ప్రెస్ చేయటం ద్వారా వైర్లెస్ చార్జింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కావాలనుకుంటే భవిష్యత్తులో ఈ సిస్టమ్ ద్వారా 7 కి.వా. రేటు వద్ద విద్యుత్ను వైర్లు లేకుండా బదిలీ చేసుకోవచ్చని బిఎమ్డబ్ల్యూ చెబుతోంది.
కేవలం బిఎమ్డబ్ల్యూ-డైమ్లర్ సంస్థలే కాకుండా నిస్సాన్-టొయోటా సంస్థలు కూడా ఈ తరహా టెక్నాలజీని అభివృద్ధి చేయటంపై పనిచేస్తోంది. బాగుంది కదూ.. ఈ వైర్లెస్ చార్జింగ్ టెక్నిక్..!


Click it and Unblock the Notifications








