వరుసగా రెండవ నెలలోను పెరిగిన కార్ల అమ్మకాలు
గడచిన కొద్ది నెలలుగా మందకొడిగా సాగుతున్న భారత ఆటోమొబైల్ అమ్మకాలు గత జూన్ 2014 నెలలో స్వల్పంగా పుంజుకున్నాయి. భారతదేశంలోని టాప్ 9 కంపెనీల ప్యాసింజర్ కార్ల అమ్మకాలు అన్నీ కలిపి గత నెలలో 2,04,287 యూనిట్లుగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే ఆటో రంగానికి తిరిగి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది.
కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వంతో పాటు కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ డిసౌంట్లు ఆఫర్ చేయడం, అలాగే గడచిన మధ్యంతర బడ్జెట్లోని ఎక్సైజ్ సుంకం తగ్గింపులను ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడగించడం వలన మార్కెట్ సెంటిమెంట్ బలపడి కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే అమ్మకాలు 18 శాతం వరకు పెరిగాయి.

గడచిన జూన్ నెలలో మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు 31 శాతం పెరిగి 1,00,964 యూనిట్లకు చేరగా అంతకు ముందు సంవత్సరం జూన్ నెలలో ఇవి 77,002 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో హ్యూందాయ్ 30,610 యూనిట్ల నుంచి 33,514 యూనిట్లకు పెరిగాయి. కాగా.. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17,232 యూనిట్ల నుంచి 16,780 యూనిట్లకు తగ్గాయి.
టాటా మోటార్స్ అమ్మకాసు కూడా భారీగా క్షీణించాయి. జూన్ 2013లో టాటా మోటార్స్ 11,804 యూనిట్లను విక్రయించగా, జూన్ 2014లో కేవలం 7,911 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కాగా.. హోండా కార్స్ ఇండియా అమ్మకాలు మాత్రం 9,297 యూనిట్ల నుంచి 16,316 యూనిట్లకు పెరిగాయి. జనరల్ మోటార్స్ అమ్మకాలు 6,575 యూనిట్ల నుంచి 5,172 యూనిట్లకు పడిపోయాయి.

టాయోటా అమ్మకాలు 11,010 యూనిట్ల నుంచి 12,010 యూనిట్లకు పెరిగాయి. ఫోర్డ్ ఇండియా అమ్మకాలు 7,145 యూనిట్ల నుంచి 7,258 యూనిట్లకు పెరిగాయి. నిస్సాన్ ఇండియా అమ్మకాలు 2,949 యూనిట్ల నుంచి 4,362 యూనిట్లకు పెరిగాయి. మొత్తమ్మీద చూసుకుంటే, గడచిన జూన్లో 2,04,287 కార్లు అమ్ముడుపోగా, అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో 1,73,624 కార్లు అమ్ముడుపోయాయి.


Click it and Unblock the Notifications








