ఎక్సైజ్ డ్యూటీ రాయితీ గడువును పొడగించండి: కార్ మేకర్స్
ఈ ఏడాది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ వాహనాలపై తగ్గించిన ఎక్సైజ్ సుంకాలను, బిజెపి సర్కారు ఈ ఏడాది డిసెంబర్ 2014 వరకూ పొడగించిన సంగతి తెలిసినదే.
మరికొద్ది రోజుల్లో ఈ ఎక్సైజ్ డ్యూటీ రాయితీల గడువు ముగియనుండటం, మరోవైపు భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఇంకా మందకొడిగానే సాగుతున్న నేపథ్యంలో, మరికొంత కాలం పాటు ఈ రాయితీలను పొడగించాలని కార్ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
గతంలోనే, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎక్సైజ్ రాయితీలను మార్చ్ 2015 వరకూ పొడగించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఓ ప్రతిపాదనను కూడా పంపించినట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వం దీనిపై తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

మందకొడిగా సాగుతున్న ఆటోమొబైల్ పరిశ్రమకు ఆసరగా నిలిచేందుకు, గడచిన ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కార్లు, ఎస్యూవీలు, ద్విచక్రవాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసినదే.
మధ్యంతర బడ్జెట్లో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు). అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు). ఎస్యూవీలపై సుంకాన్ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిన (6 శాతం తగ్గింపు) విషయం తెలిసినదే. ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ రేట్లు డిసెంబర్ 31, 2014 వరకు చెల్లుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








