ప్యాసింజర్ వాహన అమ్మకాల వృద్ధి స్వల్పమే: ఐఆర్సిఏ
భారత్లో అనేక కొత్త కార్లు విడుదల అవుతున్నప్పటికీ, అమ్మకాలు పెంచుకునేందుకు తయారీదారులు కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నప్పటికీ, రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు స్వల్పంగానే పెరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్ఏ అంచనా వేస్తోంది.
చిన్న కార్లు, యుటిలిటీ వాహనాల విభాగంలో డిమాండ్ బలహీనంగా ఉంటోందని, ఫలితంగా దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2-3 శాతం వృద్ధినే సాధిస్తాయని ఐసిఆర్ఏ పేర్కొంది. ఐసిఆర్ఏ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు 6-7 శాతం వరకూ క్షీణించవచ్చని అలాగే, మొత్తం వాహన అమ్మకాల్లో చిన్న కార్ల అమ్మకాల వాటా 55-60 శాతం వరకు ఉండొచ్చని అంచనాలున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 నెలలకు గాను మొత్తం 23 లక్షల ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మునుపటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలం అమ్మకాలతో పోల్చుకుంటే ఇది 6 శాతం క్షీణతను చూపిస్తోంది. కానీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం చొప్పున వృద్ధి సాధించిన దాఖలాలు కూడా ఉన్నాయి.
దిగిరాని ద్రవ్యోల్బణం, అందుబాటులో లేని అధిక వడ్డీరేట్లు, నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు మొదలైన కారణాల వలన గడచిన మూడేళ్లలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాహనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో, రానున్న నెలల్లో డిమాండ్ స్వల్పంగా పుంజుకోవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








