మోటార్ వాహన చట్టం క్రిందకు ఎలక్ట్రిక్ రిక్షాలు
దేశ రాజధాని నగరంలో పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్ రిక్షాలు అక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఎలక్ట్రిక్ రిక్షాలు తమ పొట్ట కొడుతున్నాయని సాధారణ (పెట్రోల్/డీజిల్/సిఎన్జి) ఆటోరిక్షా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ రిక్షాలకు ఎలాంటి నిబంధనలు విధించక పోవటంపై ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు.
తమ ఆటోరిక్షాలలో ప్యాసింజర్ లిమిట్, లోడ్ లిమిట్ ఉంటాయని అంతకు మించి తీసుకువెళ్తే పోలీసులు జరిమానా విధిస్తున్నారని, కానీ ఎలక్ట్రిక్ రిక్షాలలో ఎంత మంది ప్యాసింజర్లను ఎక్కించుకున్నా, ఎంత లగేజ్ను తీసుకువెళ్తున్నా పట్టించుకోవటం లేదని, అందుకే తక్షణమే ఎలక్ట్రిక్ రిక్షాలకు పరిమితులను విధిస్తూ, వాటిని కూడా మోటార్ వాహన చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోర్టును ఆశ్రయించారు.
ఈ అంశాలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఈ వాహనాల కోసం మార్గదర్శకాలు సిద్ధం చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నిబంధనలు ప్రత్యేక విభాగం క్రిందకు వచ్చినప్పటికీ, అవి మోటార్ వాహన చట్టం పరిధిలోనే ఉంటాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఎలక్ట్రిక్ రిక్షాలను నడిపే వారు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది.

ఈ-రిక్షాల యజమానులు మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు జారీ చేశారు. అయితే, ఈ-రిక్షాలను రిజిస్ట్రేషన్ సులువుగా అయ్యేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. నగర రోడ్లపై అనుమతించే ఈ-రిక్షాల సంఖ్య మరియు అవి సంచరించే రూట్ వంటి అంశాలను సివిక్ అధికారులకే వదిలేయనున్నారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, కాలుష్య రహిత రిక్షాల వేగాన్ని గంటకు 25 కిలోమీటర్లకు పరిమితం చేయనున్నారు మరియు వీటిపై కేవలం నలుగురు ప్రయాణీకులను మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతించనున్నారు. ప్రస్తుతం రోడ్లపై ఉన్న ఈ-రిక్షాల బ్రేక్స్, లైట్, హారన్, టైర్స్ వంటి అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








