టాటా మోటార్స్ నుంచి ప్రతి ఏటా రెండు కొత్త మోడళ్లు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ దిశలో భాగంగా, ఇకపై ప్రతి ఏటా రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ ప్రకటించింది.
ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవటమే తమ ప్రధాన లక్ష్యమని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ తెలిపారు.

మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త మోడళ్లను అందించలేకపోవడం వల్లనే అమ్మకాల్లో వెనకబడ్డామని, అందుకే ఇక నుంచి ఏడాదికి రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని చెప్పారు.
ఈ దిశలో మొదటి అడుగుగా.. ఈ ఏడాది తమ సరికొత్త టాటా బోల్ట్ హ్యాచ్బాక్ మరియు టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్లను విడుదల చేస్తామని, మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించిన తమ కాన్సెప్ట్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ నెక్సన్ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని, అయితే దీనికంటే ముందే మరికొన్ని కొత్త మోడళ్లను కస్టమర్లకు అందిస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. వచ్చే ఆగస్టులో ‘జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ను విడుదల చేసిన తర్వాత సెప్టెంబర్ నెలలో ‘బోల్ట్' హ్యాచ్బ్యాక్ను మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. టాటా విస్టా హ్యాచ్బ్యాక్, టాటా మాంజా సెడాన్లకు రీప్లేస్డ్ వెర్షన్లుగా ఈ మోడళ్లను అందించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








