ఎక్సైజ్ డ్యూటీ కట్ గడువు, జనవరి 2015 కార్ల ధరలకు రెక్కలు
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ వాహనాలపై తగ్గించిన ఎక్సైజ్ సుంకాలను, కొత్తగా వచ్చిన బిజెపి సర్కారు మరికొంత కాలం పాటు పొడగించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ తగ్గింపులు నేటితో (డిసెంబర్ 31, 2014) ముగియనున్నాయి. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లయితే, కొత్త కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే, జనవరి 2015 నుంచి కార్ల ధరలను పెంచాలని దాదాపు అన్ని కార్ కంపెనీలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, దీనికి తాజా ఎక్సైజ్ సుంకం పెంపు తోడైనట్లయితే, కార్ల ధరలు మరింత ప్రియమయ్యే ఆస్కారం ఉంది. అయితే, ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఇంకా మందకొడిగానే సాగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఈ ఎక్సైజ్ సుంకపు రాయితీలను మరికొంత కాలం పాటు పొడగించే అవకాశాలు కనిపించడం లేదు.

మందకొడిగా సాగుతున్న ఆటోమొబైల్ పరిశ్రమకు ఆసరగా నిలిచేందుకు, గడచిన ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కార్లు, ఎస్యూవీలు, ద్విచక్రవాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసినదే. మధ్యంతర బడ్జెట్లో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు).
అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు). ఎస్యూవీలపై సుంకాన్ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిన (6 శాతం తగ్గింపు) విషయం తెలిసినదే. ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ రేట్లు డిసెంబర్ 31, 2014 వరకు చెల్లుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








