ఇండియాలో రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫెరారీ, మాసేరటి
ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ గ్రూపుకి చెందిన ఇటాలియన్ పెర్ఫార్మెన్స్ కార్ దిగ్గజాలు ఫెరారీ మరియు మాసేరటి బ్రాండ్లు వచ్చే ఏడాదిలో భారత మార్కెట్లోకి పునఃప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
మాసేరటి ఇప్పటికే తమ నేషనల్ సేల్స్ కంపెనీ రన్ చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉండగా, ఫెరారీ తమ భారతీయ కార్యకలాపాలను దుబాయ్ నుంచి నిర్వహించేందుకు యోచిస్తోంది.

వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి మాసేరటి భారత్లో ఎక్స్క్లూజివ్ డీలర్షిప్ కేంద్రాలను ఏర్పాటు చేసి, కార్యకలాపాలను ప్రాభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో ఇప్పటికే తమ డీలర్ భాగస్వాములను ఖరారు చేసుకునేందుకు ఈ కంపెనీకి చెందిన ఓ అత్యున్నత స్థాయి బృందం ఇండియాకు వచ్చినట్లు కూడా సమాచారం.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం రోల్స్ రాయిస్ డీలర్షిప్లను నవనీత్ మోటార్స్ ముంబైలో ఫెరారీ డీలర్గాను, ఆస్టన్ మార్టిన్ వంటి బ్రాండ్లను డీల్ చేస్తున్న యాదుర్ కూప్ న్యూఢిల్లీ ఫెరారీ డిలర్గా నియామకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2015 తొలి త్రైమాసికంలో ఫెరారీ ఇండియాలో నేరుగా విక్రయాలను ప్రారంభించే అవకాశం ఉంది.

అయితే, అధిక దిగుమతి సుంకాల కారణంగా భారత మార్కెట్లో సూపర్ లగ్జరీ కార్ల అమ్మకాలు అంత జోరుగా సాగటం లేదు. ఇటీవలి నివేదికల ప్రకారం, ఈ ఏడాది దేశంలో రూ.2-6 కోట్ల మధ్యలో ధరలు కలిగిన సూపర్ లగ్జరీ కార్ల అమ్మకాలు 10-15 శాతం పడిపోవచ్చని తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో సుమారు 110-115 కార్లు మాత్రమే అమ్ముడుపోవచ్చని అంచనా.
కానీ.. ఫెరారీ, మాసేరటి బ్రాండ్స్ విషయంలో మాత్రం ఇవి ఇండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీటి అమ్మకాలు జోరందుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి మాసేరటి అందుబాటులోకి తీసుకురానున్న ఎంట్రీ-లెవల్ సెడాన్ గిబ్లి ద్వారా ఇది సాధ్యం కావచ్చని తెలుస్తోంది. ఈ బ్రాండ్ 2015-16లో ఓ ఎస్యూవీని విడుదల చేయనుంది, ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్తో కూడా అందుబాటులో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








