డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేత; భారీగా తగ్గిన ధర!
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు కంపెనీల మధ్య ధరల పోటీ పెరగడంతో, ముడి చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో, భారత మార్కెట్లో కూడా డీజిల్ విక్రయంపై నష్టాలు తొలగిపోయి, లాభాలు రావటం మొదలు పెట్టాయి. ఈ పరిస్థిని ఆసరగా చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, డీజిల్ ధరల నియంత్రణను చమురు కంపెనీల చేతికి అప్పగించి, తమ చేతులు దులిపేసుకుంది.
ఇకనుంచి పెట్రోల్ ధరల మాదిరిగానే డీజిల్ ధరలను కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా చమురు కంపెనీలే నియంత్రించనున్నాయి. అంటే, అంతర్జాతీయ మార్కెట్లలోని రేట్లను బట్టి భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం జరుగుతుంది. అక్కడి మార్కెట్లో రేటు పెరిగితే ఇక్కడి మార్కెట్లో రేటును పెంచడం, అక్కడి మార్కెట్లో రేటు తగ్గితే ఇక్కడి మార్కెట్లో రేటును తగ్గించడం జరుగుతుంది.

డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని, భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయం వలన డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.4 వరకు తగ్గింది. ఇప్పటి వరకు డీజిల్ ఇంధనాన్ని సబ్సిడీ ధరకే విక్రయిస్తూ, ఆ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం మోస్తూ వచ్చేది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసే ధరలకు, భారత మార్కెట్లో విక్రయించే ధరలకు మధ్య వ్యత్యాసం సమం కావటంతో, ఇక డీజిల్ విక్రయంపై ప్రభుత్వానికి సబ్సిడీ భారం ఉండదు.
గడచిన సంవత్సర కాలంగా ప్రభుత్వం ప్రతినెలా డీజిల్ ధరను 50 పైసల చొప్పున పెంచుకుంటూ రావటం వల్లనే ఇది సాధ్యమైంది. ఏదేమైనప్పటికీ, డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేటంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఈ నిర్ణయాన్ని హర్షిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంధనాలపై ప్రభుత్వ నియంత్రణలు తొలగిపోవటంతో, ప్రైవేట్ రంగ చమురు కంపెనీలు కూడా ఇప్పటికే మూసివేయబడి ఉన్న తమ పెట్రోల్ బంకులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.


Click it and Unblock the Notifications








