ఎక్సైజ్ డ్యూటీ రాయితీ గడువును పొడగించనున్న సర్కార్!
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ వాహనాలపై తగ్గించిన ఎక్సైజ్ సుంకాలను, బిజెపి సర్కారు ఈ ఏడాది డిసెంబర్ వరకూ పొడగించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ ఎక్సైజ్ రాయితీలను వచ్చే ఏడాది మార్చ్ వరకూ పొడగించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు, ఎక్సైజ్ రాయితీలను మార్చ్ 2015 వరకూ పొడగించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రతిపాదనను పంపించనుంది. వాహనాల తయారీ సంస్థలకు ఊరట కలిగించేలా, ఈ రాయితీలను పొడగించే అంశంపై చర్చలు జరుపుతున్నామని భారీ పరిశ్రమల శాఖా మంత్రి అనంత్ గీతె తెలిపారు.

ప్రభుత్వం దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని ఏసిఎమ్ఏ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వెల్లడించారు. మందకొడిగా సాగుతున్న ఆటోమొబైల్ పరిశ్రమకు ఆసరగా నిలిచేందుకు, గడచిన ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కార్లు, ఎస్యూవీలు, ద్విచక్రవాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసినదే.
మధ్యంతరో బడ్జెట్లో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు). అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు). ఎస్యూవీలపై సుంకాన్ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిన (6 శాతం తగ్గింపు) విషయం తెలిసినదే. ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ రేట్లు ఈ ఏడాది చివరి వరకు అమల్లో ఉంటాయి.


Click it and Unblock the Notifications








