సరికొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ వస్తోంది
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి మోటార్స్ భారత మార్కెట్లో హిందుస్థాన్ మోటార్స్తో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మిత్సుబిషి మోటార్స్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్యూవీ 'పాజెరో స్పోర్ట్'లో ఓ అప్గ్రేడెడ్ వేరియంట్ను అందుబాటులోకి తీసుకురానుంది. హిందుస్థాన్ మోటార్స్ విడుదల చేయనున్న ఈ కొత్త పాజెరో స్పోర్ట్ ఎస్యూవీ కొత్త ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్తో లభ్యం కానుంది. ఇది రానున్న ఆర్థిక సంవత్సరంలో విడుదల కానుంది.
కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ తొలిసారిగా 2012లో సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత హిందుస్థాన్ మోటార్స్ చెన్నైలోని తిరువళ్లూర్ ప్లాంట్లో స్థానికంగా అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించింది. మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఎస్యూవీలో 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ ఇంజన్ గరిష్టంగా 178 బిహెచ్పిల శక్తిని, 400 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ కంపెనీ యొక్క సూపర్ సెలక్ట్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో లభ్యమవుతుంది. ఈ సిస్టమ్ ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. కాగా.. గడచిన జనవరి నెలలో మిత్సుబిషి ఓ యానివర్స్రే ఎడిషన్ పాజెరో స్పోర్ట్ ఎస్యూవీని విడుదల చేసింది. అయితే, ఇదే సమయలో అవుట్లాండర్, సెడియా స్పోర్ట్స్, ఎవల్యూషన్ ఎక్స్ మోడళ్లను మార్కెట్ నుంచి తొలగించింది.
మిత్సుబిషి నుంచి రానున్న ఈ కొత్త పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ కారులో ఐఎన్విసిఎస్-2 '5-స్పీడ్ ఆటో విత్ స్పోర్ట్రానిక్' గేర్బాక్సును ఉపయోగించనున్నారు. అయితే, ఇంజన్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఈ మోడల్ను ఇప్పటికే, థాయ్లాండ్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కాగా.. ఈ సంవత్సరంలో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్తో పాటుగా 2014 అవుట్లాండర్ మోడల్ను కూడా విడుదల చేయనున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








