యూరప్కు కార్ల ఎగుమతిని నిలిపివేసిన హ్యుందాయ్
భారతదేశపు అతిపెద్ద కార్ ఎగుమతి సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇకపై తమ చెన్నై ప్లాంట్లో తయారు చేసిన ఉత్పత్తులను యూరప్ మార్కెట్కు ఎగుమతి చేయటాన్ని నిలిపివేసింది. టర్కీ, చెక్ రిపబ్లిక్లలో ఉన్న హ్యుందాయ్ ప్లాంట్లకు ఈ యూరప్ మోడళ్ల ఉత్పత్తిని తరలించిన నేపథ్యంలో భారత్లో తయారైన కార్లను యూరప్కు ఎగుమతి చేయటాన్ని నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల, ధరలు, ఫీచర్లు
హ్యుందాయ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వలన ఈ ఏడాది కంపెనీ మొత్తం ఎగుమతులు దాదాపు 25 శాతం తగ్గిపోనున్నాయి. గడచిన సంవత్సరం హ్యుందాయ్ మొత్తం 2.53 లక్షల కార్లను ఎగుమతి చేయగా, ఈ ఏడాది సంఖ్య కేవలం 1.9 లక్షలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యుందాయ్ ఇండియా ఇప్పుడు దేశీయ మార్కెట్తో పాటుగా లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, ఏషియా వంటి మార్కెట్లపై కూడా దృష్టి సారించనుంది.

దాదాపు నెల క్రితమే యూరప్ మార్కెట్కు ఉత్పత్తులు ఎగుమతి చేయటాన్ని నిలిపివేశామని, ఇప్పుడు ఆ మార్కెట్లకు టర్కీ, చెక్ రిపబ్లిక్ల నుంచి ఉత్పత్తులను సరఫరా చేస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. హ్యుందాయ్ ఇండియాకు యూరప్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటి, ఇండియాలో తయారైన కార్లను ఎక్కువ భాగం కంపెనీ ఈ మార్కెట్కు ఎగుమతి చేస్తుంది.
హ్యుందాయ్ తాజాగా విడుదల చేసిన ఎలైట్ ఐ20 కారును కూడా యూరప్ మార్కెట్ కోసం టర్కీ ప్లాంట్లోనే ఉత్పత్తి చేస్తామని ఆయన వివరించారు. హ్యుందాయ్ ఈ సరికొత్త ఐ20 కారును ముందుగా భారత మార్కెట్లోనే విడుదల చేసింది. హ్యుందాయ్ గడచిన సంవత్సరంలో భారత్లో ఉత్పత్తి చేసిన మొత్తం కార్లలో 45 శాతం కార్లను ఎగుమతి చేసింది. యూరప్కు ఎగుమతులు నిలిపివేసిన నేపథ్యంలో, ఈ ఏడాది ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.
ఏదేమైనప్పటికీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా యూరప్ మార్కెట్లకు ఎగుమతులు నిలిపివేసి, ఇండియన్ మార్కెట్పై దృష్టి సారించడం వలన భారత్లో కంపెనీ విక్రయిస్తున్న పలు మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








