ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపులను ప్రభుత్వం కొనసాగిస్తుందా?
ఈ ఏడాది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ వాహనాలపై తగ్గించిన ఎక్సైజ్ సుంకాలను, బిజెపి సర్కారు ఈ డిసెంబర్ 2014 నెలాఖరు వరకూ పొడగించిన సంగతి తెలిసినదే. డిసెంబర్ 31, 2014తో ఈ ఎక్సైజ్ డ్యూటీ రాయితీల గడువు ముగియనుండటంతో, ఈ సుంకాల తగ్గింపును మరికొంత కాలం పొడగిస్తారా లేదా అన్న సందేహం సర్వత్రా నెలకొని ఉంది.
మరోవైపు భారత ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఇంకా మందకొడిగానే సాగుతున్న నేపథ్యంలో, ఈ ఎక్సైజ్ సుంకపు రాయితీలను మరికొంత కాలం పాటు పొడగించాలని కార్ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత సర్కారు కార్ మేకర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మాటలు వింటుంటే, కాస్తంత సానుకూల వాతావరణమే కనిపిస్తోంది.

ఈ అభ్యర్థన పరిగణలో ఉందని అరుణ్ జైట్లీ ఇంతకు మునుపే చెప్పారని, ఈ విషయంలో డిసెంబర్ 31 వరకూ వేచి చూద్దామని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన జయంత్ సిన్హా తెలిపారు. మందకొడిగా సాగుతున్న ఆటోమొబైల్ పరిశ్రమకు ఆసరగా నిలిచేందుకు, గడచిన ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కార్లు, ఎస్యూవీలు, ద్విచక్రవాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసినదే.
మధ్యంతర బడ్జెట్లో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు). అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు). ఎస్యూవీలపై సుంకాన్ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిన (6 శాతం తగ్గింపు) విషయం తెలిసినదే. ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ రేట్లు డిసెంబర్ 31, 2014 వరకు చెల్లుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








