భారత్లో జీప్ బ్రాండ్ విడుదల జాప్యం; మరోసారి వాయిదా!
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్కు చెందిన ఎస్యూవీ బ్రాండ్ 'జీప్' భారత మార్కెట్లో విడుదల కావటానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి జీప్ బ్రాండ్ 2013లో ఇండియాలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ, పలు (అంతర్గత) కారణాల వలన ఇది జాప్యం జరుగుతూ వస్తోంది.
జీప్ బ్రాండ్ ఇప్పటికే తమ గ్రాండ్ చిరోకీ, వ్రాంగ్లర్ ఎస్యూవీలను ఇండియాకు తీసుకు వచ్చి, ఇక్కడి రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. టెస్టింగ్ దశ దాదాపు పూర్తయినప్పటికీ, వీటి విడుదల మాత్యం జాప్యం అవుతోంది. గడచిన నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్పోలోనైనా ఈ రెండు మోడళ్లు ఆవిష్కరిస్తారనుకుంటే, కార్ ప్రియులకు మాత్రం నిరాశే ఎదురైంది.

గతంలో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీప్ బ్రాండ్ను విడుదల చేస్తామని ఫియట్ ప్రకటించింది. కాగా.. ఇప్పుడు ఆ విడుదల కార్యక్రమం ఈ ఏడాది చివరకు వాయిదా పడింది. బహుశా ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఏర్పడిన ఫియట్-క్రైస్లర్ కూడా ఈ జాప్యానికి గల కారణాల్లో ఒకటిగా తెలుస్తోంది.
ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేష్ బసవనహల్లి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీప్ వంటి ముఖ్యమైన ఉత్పత్తులను విడుదల చేసేందుకు ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు అంత సానుకూలంగా లేవని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

భారత్లో జీప్ బ్రాండ్ నుంచి మొదటగా రానున్న ఉత్పత్తులు గ్రాండ్ చిరోకీ మరియు వ్రాంగ్లర్. ఈ రెండు మోడళ్లను సికెడి రూట్లో విదేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత్లోనే అసెంబ్లింగ్ చేయనున్నారు. కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన జీప్ రెనెగేడ్ కాంపాక్ట్ ఎస్యూవీ కూడా ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇందుకు కనీసం మరో ఏడాదైనా సమయం పట్టొచ్చు.


Click it and Unblock the Notifications








