వచ్చే నెలలో కార్ల ధరలను పెంచనున్న మహీంద్రా, టాటా, హోండా
కొత్త కారును కొనేందుకు ఇదే అనువైన సమయం. ఈనెలలో (మార్చ్) కారు కొంటే మీకు ఆదాయం, అదే కారు కొనుగోలును వచ్చే నెలకు వాయిదా వేసుకుంటే మీరు మరింత అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఎందుకంటే, కార్ల కంపెనీలన్నీ వచ్చే నెల (ఏప్రిల్) నుంచి ధరల పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
గడచిన ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాల తగ్గింపు తర్వాత, దాదాపు అన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. మరికొన్ని కంపెనీలు ఇదే ఊపులో అమ్మకాలను పెంచుకునేందుకు అదనపు డిస్కౌంట్లను, రాయితీలను కూడా ఆఫర్ చేశాయి. అయినప్పటికీ, పెద్దగా ఆశించిన ఫలితాలు నమోదు కాలేదు.

మరోవైపు ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరుగుపోతున్న కారణంగా టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పలు ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ 2014 నెల నుంచి కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నాయి.
వచ్చే నెల నుంచి ధరలు పెంచే విషయమై తీవ్రంగానే కసరత్తు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వెల్లడించారు. అయితే, ఏయే ఉత్పత్తులపై ఎంత మేర ధరలు పెంచనున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. హోండా కార్స్ ఇండియా కూడా ధరల పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇకపోతే, టాటా మోటార్స్ కూడా ప్యాసింజర్ వాహనాల ధరలను 1-2 శాతం పెంచాలని చూస్తోంది.

ప్రస్తుతం దేశీయ విపణిలో హోండా కార్స్ ఇండియా అందిస్తున్న కార్ల ధరలు రూ.3.99 లక్షల నుంచి రూ.24.36 లక్షల రేంజ్లో ఉండగా, మహీంద్రా ప్యాసింజర్ వాహనాల ధరలు రూ.5.43 లక్షల నుంచి రూ.14.48 లక్షల రేంజ్లో ఉన్నాయి. గడచిన నెలలో ప్రభుత్వం కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో మహీంద్రా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.13,000 నుంచి రూ.49,000 రేంజ్లో తగ్గించగా, హోండా తమ కార్లపై రూ.44,741 వరకూ ధరలను తగ్గించాయి.


Click it and Unblock the Notifications








