సేఫ్ ఐ టెక్నాలజీతో మహీంద్రా మాక్సిమో మినీ వ్యాన్ స్కూల్ బస్
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతను పెంచే ఉద్దేశంతో, సేఫ్ ఐ డిజిటల్ టెక్నాలజీతో రూపొందించిన సరికొత్త 'మాక్సిమో మినీ వ్యాన్ విఎక్స్ స్కూల్ బస్'ను కంపెనీ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.
సేఫ్ ఐ టెక్నాలజీ ద్వారా బస్సు ఉన్న లొకేషన్, దాని వేగంను తెలుసుకోవచ్చని, ఇంకా రియల్-టైమ్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో ఫీడ్ను కూడా తల్లిదండ్రులు, పిల్లలు, బస్ ఆపరేటర్లు పొందవచ్చని కంపెనీ పేర్కొంది. 3జి నెట్వర్క్పై జిపిఎస్ టెక్నాలజీ ద్వారా, ఓ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా ఇది సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.

ఇంకా దీని ద్వారా ఎస్ఎమ్ఎస్ అలెర్ట్లను కూడా పొందవచ్చని, ఒకవేళ బస్కు ప్రమాదం జరిగితే వెంటనే పిల్లల తల్లిదండ్రులకు, ప్రిన్సిపాల్కు, బస్ ఆపరేటర్లకు అలర్ట్ ఎస్ఎమ్ఎస్ వెలుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవిణ్ షా తెలిపారు. స్కూల్ వెళ్లే సమయంలో, స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో బస్ ఉన్న ప్రదేశం, పిల్లల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్స్ వెంటవెంటనే పొందవచ్చునని ఆయన వివరించారు.
పాఠశాల బస్సుల భద్రత విషయంలో ఇటు తల్లిదండ్రుల్లోను అటు పాఠశాల యాజమాన్యంలోను ఆందోళన నెలకొని ఉందని, ఇలాంటి వాటిని తొలగించేందుకు తాము మాక్సిమో మినీ వ్యాన్లో సేఫ్ ఐ ఈ అధునాతన టెక్నాలజీని వినియోగించామని ప్రవీణ్ షా చెప్పారు. దేశీయ విపణిలో మాక్సిమో మినీ వ్యాన్ విఎక్స్ స్కూల్ బస్ ధరలు రూ.4.37 లక్షల నుంచి రూ.4.88 లక్షల (ఎక్స్ షోరూమ్ ముంబై) రేంజ్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








