2015లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న మహీంద్రా
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) వచ్చే ఏడాది మూడు కొత్త వాహనాలను మార్కెట్లో విడుదల చేయనుంది. వాటిలో రెండు ఎస్యూవీలు (స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్స్), ఓ ఎల్సివి (లైట్ కమర్షియల్ వెహికల్) ఉంటాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు.
తాము 2013, 2014 సంవత్సరాలలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంలో నెమ్మదిగా వ్యవహరించామని, ఇప్పుడు తాము తిరిగి ట్రాక్లోకి వచ్చామని, 2015లో రెండు సబ్-ఫోర్ మీటర్ (4 మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉన్న) కాంపాక్ట్ ఎస్యూవీలను విడుదల చేస్తామని పవన్ గోయెంకా చెప్పారు. శాంగ్యాంగ్తో కలిసి కొత్త సిరీస్ ఇంజిన్లను తయారు చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

ఇకపోతే, ద్విచక్ర వాహన విభాగంలో ఫ్రెంచ్ కంపెనీ ప్యూజోకి చెందిన మోటార్సైకిల్ యూనిట్లో వాటాల కొనుగోలు ప్రక్రియ సాగుతోందని, ఇందులో 51 శాతం వాటాను సుమారు రూ.215 కోట్లకు కొనుగోలు చేయనున్నామని చెప్పారు. ప్యూజో మోటార్సైకిల్స్ ఉత్పత్తులను భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా విక్రయించనున్నామని వివరించారు.
అయితే, వీటిని ఎప్పుడు భారత్లో విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా తెలుపలేదు. ప్యూజో మోటార్సైకిల్స్ కంపెనీ తయారీ వనరులను మహీంద్రా టూవీలర్స్లో వినియోగించుకుంటామని, ఈ సంస్థ సహకారంతో మోజో మోటార్సైకిల్ను మార్కెట్లోకి తీసుకువస్తామని, మరో ఆరు నెలల్లోనే మోజో బైక్ని విడుదల చేస్తామని గోయెంకా తెలిపారు.


Click it and Unblock the Notifications








