2015 మధ్య భాగం నాటికి రానున్న మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ సెడాన్ మహీంద్రా వెరిటో (Verito)లో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్ను తొలిసారిగా 2012లో జరిగిన ఆటో ఎక్స్పోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన సంగతి తెలిసినదే. ఆ తర్వాత ఇటీవల ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014లో ఆటో ఎక్స్పోలో ప్రొడక్షన్కు దగ్గరగా ఉన్న వెరిటో ఎలక్ట్రిక్ను కంపెనీ ఆవిష్కరించింది.
ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా వెరిటో కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్తో మాత్రమే లభ్యమవుతోంది. కాగా.. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా వెరిటోను వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి భారత విపణిలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.
మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్ కారును టాక్సీ మరియు కమర్షియల్ కార్ రెంటల్ విభాగంలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని, ఈ విభాగాల్లో ఇది మంచి విజయం సాధించగలదని ఆశిస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గోయెంకా వెల్లడించారు.

వాస్తవానికి మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్ వెర్షన్ ఇదివరకే మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, ఈ రకం కార్లపై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న పన్నుల విధానం కారణంగా, కంపెనీ వేచి చూసే ధోరణిలో ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై భారత సర్కారు సబ్సిడీని అందించినట్లయితే, ఇవి తక్కువ ధరకే కస్టమర్లకు లభించే అవకాశం ఉంటుంది.
మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్ కారులో 72 వోల్ట్ లిథియం ఐయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీ కేవలం 7 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. ఫాస్ట్ చార్జ్ సాయంతో ఈ సమయాన్ని ఒక గంటకు తగ్గించుకోవచ్చు. పూర్తి చార్జ్పై 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. ఇందులో 29 కి.వా ఏసి ఎలక్ట్రిక్ మోటార్ను ఉపయోగించారు. ఇది సింగిల్ స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఈ2ఓ మాదిరిగా)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








