క్యూ1లో పెరిగిన మారుతి సుజుకి మార్కెట్ వాటా
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బ్రాండ్కు గ్రామీణ మార్కెట్ల నుంచి ఆదరణ బాగా పెరగడంతో, దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో కంపెనీ వాటా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మారుతి సుజుకి మార్కెట్ వాటా 42 శాతానికి పెరిగింది.
సియామ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో కంపెనీ మొత్తం 2,41,812 యూనిట్లు విక్రయించింది. కాగా.. మొత్తమ్మీద ఆటోమొబైల్ కంపెనీలు 5,73,038 యూనిట్లు విక్రయించినట్లు సియామ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సియామా లెక్కల ప్రకారం, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో మారుతి వాటా 42.19 శాతంగా నమోదైంది.

గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే మొదటి త్రైమాసికంలోమారుతి 2,22,645 యూనిట్లు విక్రయించగా, ఆ సమయంలో మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 5,58,416 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆ సమయంలో మారుతి సుజుకి మార్కెట్ వాటా 39.87 శాతంగా ఉన్నట్లు సియామ్ పేర్కొంది.
కాగా.. గడచిన జూన్ 2014లో మారుతి సుజుకి మొత్తం 91,226 యూనిట్లు విక్రయించగా, మొత్తం దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు కలిసి 2,04,081 యూనిట్లను విక్రయించాయి. ఈ ఒక్క నెలలో చూసుకుంటే మారుతి సుజుకి మార్కెట్ వాటా 45 శాతంగా ఉంది. గ్రామీణ మార్కెట్ డిమాండ్ను కైవసం చేసుకోవటంలో మారుతి సుజుకి వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.


Click it and Unblock the Notifications








