కొత్త మోడళ్లు, మార్కెటింగ్ కోసం రూ.4000 కోట్లు: మారుతి
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కొత్త మోడళ్ల అభివృద్ధి కోసం భారీ పెట్టుబడులను వెచ్చించనుంది. రానున్న ఆర్థిక సంవత్సరం రూ.4,000 కోట్లు పెట్టుబడి వెచ్చించి, ఈ మొత్తాన్ని కొత్త మోడళ్లను తయారు చేయటం, మార్కెటింగ్ కార్యకలాపాలు మరియు ఆర్ అండ్ డి అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గడచిన శనివారం మారుతి సుజుకి కంపెనీ బోర్డు సమావేశమై వచ్చే ఆర్థిక సంవత్సరంలో వెచ్చించనున్న పెట్టుబడుల గురించి చర్చించి వాటిని ఆమోదించింది. గుజరాత్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ప్రతిపాదనకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.4,000 కోట్ల పెట్టుబడికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ప్రకటించింది.

మారుతి సుజుకి గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్పోలో సెలెరియో హ్యాచ్బ్యాక్ను విడుదల చేయటంతో పాటుగా, ఉత్పత్తికి సిద్దంగా ఉన్న ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ మరియు సియాజ్ కాన్సెప్ట్ కార్లను కూడా ప్రదర్శించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ త్వరలోనే మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.
అంతేకాకుండా, మారుతి సుజుకి ఓ కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే, ఇది వచ్చే ఏడాది ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. మారుతి సుజుకి ఇండియా తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డి) విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను గట్టి చర్యలు తీసుకుంటోంది. హర్యానాలో ఉన్న రోహతక్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది. ఈ ఆర్ అండ్ డి సెంటర్ 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
ఈ రోహతక్ ఆర్ అండ్ డి కేంద్రంలోనే టెస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేయటం ద్వారా కొత్త కార్లను పరీక్షించాలని నిర్ణయించామని, అలాగే ఇక్కడే కొత్త మోడళ్ల రూపకల్పన కూడా జరుగుతుందని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ మూలధనం రూ.3,000 కోట్ల వరకు కేటాయించినట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications








