మూడేళ్ల గరిష్టానికి పెరిగిన మారుతి సుజుకి మార్కెట్ వాటా
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా గడచిన మూడేళ్లలో లేనంతగా మార్కెట్ వాటాను పెంచుకుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీ అమ్మకాలు జోరుగా సాగుతుండటం, ఈ బ్రాండ్ పట్ల ఆదరణ క్రమంగా పెరుగుతుండటంతో మారుతి సుజుకి మార్కెట్ వాటా ఆరు శాతం పెరిగింది.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం, గడచిన సంవత్సరంలో మారుతి సుజుకి మార్కెట్ వాటా 49.24 శాతంగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరంలో ఇది 43.85 శాతంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2013 సంవత్సరంలో తొలిసారిగా వార్షిక కార్ల అమ్మకాలు 11 శాతం పడిపోయినప్పటికీ, మారుతి సుజుకి మార్కెట్ వాటా మాత్రం ఆరు శాతం వృద్ధిని సాధించడం గమనార్గం.
ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికం నాటికి మారుతి సుజుకి మొత్తం కార్ల అమ్మకాలు 6.7 శాతం వృద్ధిని సాధించి 6,37,000 వాహనాలను విక్రయించింది. నవంబర్ 2013లో 42 శాతంగా ఉన్న మార్కెట్ వాటా డిసెంబర్ నెలాఖరు నాటికి 46 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద చూసుకుంటే, మారుతి సుజుకి ఇండియా ప్రతికూల మార్కెట్ వాతావరణ పరిస్థితుల్లోనూ సానుకూల ఫలితాలను ప్రకటించడం విశేషం.



Click it and Unblock the Notifications








