జనవరి 2015 నుంచి పెరగనున్న మారుతి కార్ల ధరలు
కొత్త సంవత్సరంలో కొత్త కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. హ్యుందాయ్ ఇప్పటికే జనవరి 2015 నుంచి ధరలను పెంచనున్నట్లు ప్రకటించగా, తాజాగా మారుతి సుజుకి ఇండియా కూడా వచ్చే ఏడాది ఆరంభం నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. మోడల్ను బట్టి ఈ ధరల పెంపు 2 శాతం నుంచి 4 శాతం వరకూ ఉంటుందని కంపెనీ వివరించింది.
అక్టోబర్ 2013లో చివరి సారిగా తాము తమ కార్ల ధరలను పెంచామని, కాగా వచ్చే జనవరి 2015 నుంచి అన్ని ఉత్పత్తుల ధరలను 2-4 శాతం పెంచనున్నామని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ఎస్ కల్సి తెలిపారు.
గత కొంత కాలంగా మారుతి సుజుకి ధరల భారాన్ని తనే భరిస్తూనే వస్తోందని, మార్కెట్ పరిస్థితులు సరిగ్గా లేనందున తాము తమ ఉత్పత్తుల ధరలను పెంచలేదని, ఈ నేపథ్యంలో, ధరల వత్తిడిని తట్టుకునేందుకు స్వల్పంగా పెంపును విధించాలని నిర్ణయించామని ఆయన వివరించారు.
ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో ఆల్టో 800 మొదలుకొని గ్రాండ్ విటారా వరకూ వివిధ సెగ్మెంట్లో ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. మార్కెట్లో మారుతి కార్ల ధరలు రూ.2.37 లక్షల నుంచి రూ.24.6 లక్షల మధ్యలో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.



Click it and Unblock the Notifications








