సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించింది. 'మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్' బ్రాండ్ క్రింద కంపెనీ ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) లగ్జరీ కార్లను విక్రయించనుంది.
ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎబర్హార్డ్ కెర్న్ మాట్లాడుతూ.. సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజ్ కార్లకు గిరాకీ పెరుగుతోందని, మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్ ద్వారా ఈ డిమాండ్ను తీర్చుతామని చెప్పారు.
ముంబై, బెంగుళూరు, పూనే, ఢిల్లీ, మొహాలీ, ఛండీఘడ్, కొచ్చి, చెన్నై మరియు హైదరాబాద్లలో కంపెనీ మొత్తం 12 మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్ షోరూమ్లను ప్రారంభించింది. వీటితో పాటుగా 150 డిస్ప్లే బేలను కూడా కంపెనీ ప్రారంభించింది, ఈ సంఖ్యను 2015 చివరి నాటికి 250కు పెంచనున్నారు.

తమ కొత్త కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఆఫర్ చేస్తున్న అన్ని రకాల సదుపాయాలను మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్ కస్టమర్లకు కూడా ఆఫర్ చేస్తామని, ఇందులో ఫైనాన్సింగ్, వారంటి మొదలైనవి ఉంటాయని ఆయన వివరించారు.
మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్ బ్రాండ్ను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం తయారు చేశామని, ఎవరైనా పాత మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసి, ఐదు రోజులు ఉపయోగించిన తర్వాత, వారు ఆ కారుతో సంతృప్తి చెందకపోయినట్లయితే, కారును తిరిగి వెనక్కి ఇచ్చేయవచ్చని, అయితే ఈ సౌకర్యం కేవలం ఐదేళ్లు కన్నా తక్కువ వయస్సు కలిగిన కార్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








