కార్ మేకర్లకు శిశుపాలుడి రూల్; 100 ఫిర్యాదులు దాటితే రీకాల్!
లోపపూరితమైన వాహనాలను తయారు చేసే కార్ కంపెనీలకు ఇక కాలం చెల్లిపోనుంది. కార్ మేకర్లు తయారు చేసే ఏదైనా వాహనంలో నిర్దిష్ట సమస్యకు సంబంధించి కస్టమర్ల నుంచి 100 ఫిర్యాదులు అందితే, సదరు కంపెనీ ఆ వాహనాలన్నింటినీ రీకాల్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఓ డ్రాఫ్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్ను ప్రతిపాదిస్తోంది మన కేంద్ర ప్రభుత్వం.
ప్రమాదాలకు కారణమయ్యే లోపపూరితమైన కార్ల తయారీకి అడ్డుకట్ట వేసేందుకే ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకవచ్చారు. ఇందులో భాగంగా, కార్లను తయారీ చేసే కంపెనీలు విక్రయిస్తున్న ఏదైనా మోడల్లో నిర్దిష్ట సమస్యకు సంబంధించి కస్టమర్లు 'వాహన నియంత్రణ మరియు రోడ్డు భద్రత సంస్థ' (వెహికల్ రెగ్యులేషన్ అండ్ రోడ్ సేఫ్టీ అథారిటీ) ఫిర్యాదు చేయవచ్చు.
ఇలా ఒకే సమస్యకు సంబంధించి కస్టమర్ల నుంచి 100 ఫిర్యాదులు అందినట్లయితే, సదరు మోడల్ను రీకాల్ చేసి, సమస్యను సరిచేయాల్సిందిగా వెహికల్ రెగ్యులేషన్ అండ్ రోడ్ సేఫ్టీ అథారిటీ సంబంధిత కార్ మేకర్ను ఆదేశిస్తుంది. ఉదాహరణకు ఏదైనా కార్ కంపెనీ తయారు చేసిన కారులో స్టీరింగ్కు సంబంధించి కానీ లేదా బ్రేక్స్కు సంబంధించి కానీ 100 మంది కస్టమర్లు 100 ఫిర్యాదులు చేసినట్లయితే, ఆ నిర్ధిష్ట కార్ మోడల్ను కంపెనీ తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి ఉంటుందన్నమాట.

వెహికల్ రెగ్యులేషన్ అండ్ రోడ్ సేఫ్టీ కోసం ఓ వ్యక్తిగత విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఏదైనా వాహనంలో లోపాలున్నాయని ఈ సంస్థ గుర్తిస్తే, సదరు వాహనానికి సంబంధించి కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రాకపోయినా సరే, ఆ వాహనాన్ని రీకాల్ చేయమని కార్ మేకర్ను ఆదేశించే అధికారం ఈ విభాగానికి కల్పించనున్నారు.
ఎవరైనా కస్టమర్ కారును తయారీదారుడు రీకాల్ చేసినట్లయితే, వాహనం విలువకు సమానమైన మొత్తాన్ని పరిహారంగా చెల్లించడం లేదా పాత వాహనం స్థానంలో కొత్త వాహనాన్ని ఇవ్వటం లేదా సదరు వాహనాన్ని ఉచితంగా మరమ్మత్తు చేసి ఇవ్వటం వంటివి చేయాల్సిందిగా ఈ డ్రాఫ్టు బిల్లులో ప్రతిపాదనలు చేశారు. మరి ఈ నిబంధనలు ఎంత వరకు కార్యరూపం దాల్చుతాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








