కొత్త మోటార్ బిల్: ఇన్సూరెన్స్ లేకపోతే రూ.75,000 ఫైన్!
సమగ్రవంతమైన రోడ్డు భద్రత కోసం మోటార్ వాహన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే వారిపై శిక్షలు/జరిమానాలను మరింత కఠినతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వాహన బిల్ను ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసినదే. ‘కొత్త రోడ్డు భద్రత, రవాణా బిల్లు-2014' పేరుతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది.
ఈ బిల్లు ప్రకారం, రోడ్డు నిబంధనలు అతిక్రమించి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ బిల్లులోని ప్రతిపాదనలలో ఎలాంటి మార్పులు చేయకుండా, పార్లమెంటు దీనిని యధాతథంగా పాస్ చేసినట్లయితే, ఇకపై నేరాలకు పాల్పడే మోటారిస్టుల జేబులకు భారీ చిల్లలు పడటం ఖాయం. ప్రత్యేకించి ఇన్సూరెన్స్ (బీమా) లేని లేదా బీమా గడువు చెల్లిపోయిన వాహన యజమానలు కొత్త బీమాను తీసుకోకుండా లేదా రెన్యువల్ చేసుకోకుండా తమ వాహనాలను అలానే నడిపినట్లయితే, భారీ జరిమానాలను చెల్లించాల్సి వస్తుంది.

ఈ బిల్లులోని ప్రతిపాదన ప్రకారం, సరైన ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా మోటార్సైకిల్ నడిపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కినట్లయితే, సదరు వాహన యజమానికి రూ.10,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అదే లైట్ మోటార్ వెహికల్ (కారు, జీపు మొదలైవని) లేదా ఆటోరిక్షా అయితే రూ.25,000 వరకు లేదా ట్రక్కు, బస్సు వంటి భారీ వాహనాలైతే రూ.75,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారమైతే, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త మోటార్ వాహన బిల్లు కోసం ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తోంది. ప్రజల నుంచి, సంబంధిత రంగాల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించిన తర్వాత, బిల్లును ఖరారు చేసి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో ఎలాంటి మార్పులు చేయకుండా, పార్లమెంట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ప్రకటిస్తే, ఇకపై రోడ్డు నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








