మారుతి సుజుకిని ఓవర్టేక్ చేసిన నిస్సాన్ ఇండియా!
మనదేశంలో తయారైన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయటంలో ఇప్పటి వరకు భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల ఎగుమతిదారుగా ఉన్న మారుతి సుజుకి ఇండియా, ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయింది. జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియా ఈ స్థానాన్ని ఆక్రమించుకొని మారుతి సుజుకిని తృతీయ స్థానంలోకి నెట్టివేసింది.
వాహనాల ఎగుమతి విషయంలో ఒకప్పుడు మారుతి సుజుకి ఇండియానే నెంబర్ వన్గా ఉండేంది. అయితే, దాదాపు దశాబ్ధం క్రితం కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ స్థానాన్ని ఆక్రమించుకొని మారుతి సుజుకి ఇండియాను ద్వితీయ స్థానంలోకి నెట్టివేసింది. తాజాగా.. నిస్సాన్ ఇండియా దెబ్బతో వాహనాల ఎగుమతిలో మారుతి సుజుకి మూడవ స్థానానికి దిగజారింది.

గడచిన ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లలో నిస్సాన్ మైక్రా, సన్నీ కార్లకు (ఇవి భారత్లో తయారవుతున్నాయి) మంచి డిమాండ్ ఏర్పడింది. మారుతి సుజుకి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఏ-స్టార్, ఆళ్టో, డిజైర్ మోడళ్ల కన్నా సన్నీ, మైక్రాలకే ఎక్కువ డిమాండ్ నెలకొంది.
ఈ సమయంలో నిస్సాన్ ఇండియా మొత్తం 1.6 లక్షల కార్లను ఎగుమతి చేసి ఎగుమతుల్లో 16 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, మారుతి సుజుకి 1.01 లక్షల కార్లను ఎగుమతి చేసి ఎగుమతుల్లో 16 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. కాగా.. ఇదే సమయంలో హ్యుందాయ్ మోటార్ 2.33 లక్షల వాహనాలను ఎగుమతి చేసి మార్కెట్ లీడర్గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications








