కొత్త సంవత్సరంలో మరింత ప్రియం కానున్న నిస్సాన్ కార్ల ధరలు
మంచి తగ్గింపు రేటులో నిస్సాన్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే, వచ్చే ఏడాది ఆరంభం నుంచి కార్ల ధరలను పెంచనున్న కంపెనీల జాబితాలో తాజాగా నిస్సాన్ కూడా చేరిపోయింది. జనవరి 2015 నుంచి నిస్సాన్, డాట్సన్ కార్ల ధరలను పెంచనున్న నిస్సాన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
మోడల్ను బట్టి ఈ ధరల పెంపు 2.5 శాతం వరకూ ఉంటుందని కంపెనీ వివరించింది. అంటే డాట్సన్ కారుపై సుమారు రూ.11,000 వరకూ అలాగే నిస్సాన్ కార్లపై రూ.18,000 వరకూ ధరలు పెరగనున్నాయన్నమాట.
పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల వలన నిస్సాన్, డాట్సన్ వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని, తమ కస్టమర్లకు నిస్సాన్, డాట్సన్ వాహనాలను అత్యుత్తమ విలువను, ఎంపికను ఆఫర్ చేయగలవనే ధీమా తమకు ఉందని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరున్ మల్హోత్రా చెప్పారు.

నిస్సాన్ ప్రస్తుతం భారత మార్కెట్లో మైక్రా యాక్టివ్, మైక్రా, సన్నీ, ఇవాలియా, టెర్రానో మోడళ్లను విక్రయిస్తోంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.4.19 లక్షల నుంచి రూ.12.49 లక్షల రేంజ్లో ఉన్నాయి. ఇకపోతే, డాట్సన్ బ్రాండ్ క్రింద కంపెనీ ఒకే మోడల్ను విక్రయిస్తోంది. విపణిలో డాట్సన్ గో హ్యాచ్బ్యాక్ ప్రారంభం ధర రూ.3.12 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ఇప్పటికే, మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, జనరల్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలతో పాటుగా బిఎమ్డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ మేకర్లు కూడా జనవరిలో ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








