ప్రధాని నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ పరుగు
భారతదేశపు మొట్టమొదటి 'బుల్లెట్ ట్రైన్' ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్లో పరుగులు తీయనుంది. ఈమేరకు బుల్లెట్ రైళ్లను భారత్లో కూడా ప్రవేశపెట్టడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. నేడు (జులై 8, 2014) కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో బుల్లెట్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు.
బుల్లెట్ రైళ్లు వీలైనంత త్వరగా భారత్లో పరుగులు తీస్తుంటే చూడాలనేది ప్రతి భారతీయుడి కోరిక, కల అని, ఈ కలను సాకారం చేసేందుకు భారతీయ రైల్వే సిద్ధంగా ఉందని, అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా సదానంద గౌడ వివరించారు.
ఈ రూట్లో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు గల సాధ్యాసాధ్యాల గురించి అనేక అధ్యనాలు చేశారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య వేగంగా పరుగులు తీస్తున్న రైలు శతాబ్ధి ఎక్స్ప్రెస్, ఇందులో ప్రయాణ సమయం 7 గంటలు. కాగా.. ఈ రూట్లో ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని అంచనా.

ఇదిలా ఉండగా.. దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ రైల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని ఈ రైల్వే బడ్జెట్లో నిర్ణయించారు. ఇందు కోసం సుమారు రూ.100 కోట్లను ఖర్చు చేయనున్నారు. బుల్లెట్ ట్రైన్ల కోసం పూర్తిగా సరికొత్త రైల్వే నెట్వర్క్ కావాలని, కాగా హై-స్పీడ్ రైళ్ల కోసం ప్రస్తుత రైళ్ల వేగాన్ని పెంచితే సరిపోతుందని ఆయన అన్నారు. ఇందుకు తగినట్లుగా ప్రస్తుత నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయనున్నారు. హై-స్పీడ్ రైళ్ల కోసం గుర్తించిన సెక్టార్లు ఇలా ఉన్నాయి:
1) ఢిల్లీ - ఆగ్రా
2) ఢిల్లీ - ఛండీఘడ్
3) ఢిల్లీ - కాన్పూర్
4) నాగ్పూర్ - బిలాస్పూర్
5) మైసూర్ - బెంగుళూరు - చెన్నై
6) ముంబై - గోవా
7) ముంబై - అహ్మదాబాద్
8) చెన్నై - హైదరాబాద్
9) నాగ్పూర్ - సికింద్రాబాద్


Click it and Unblock the Notifications








