వానలు సరిగ్గా పడకపోతే, ఆటోమొబైల్ అమ్మకాలు జరగవు: సియామ్
ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోతే, దేశీయ విపణిలో ఆటోమొబైల్ అమ్మకాలు సజావుగా జరగవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) అభిప్రాయపడింది. గడచిన మే నెలలో మొత్తమ్మీద ఆటోమొబైల్ అమ్మకాలు స్వల్పంగా వృద్ధని కనబరిచినప్పటికీ, వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం తక్కువగా కురిసే వర్షాల ఆటోమొబైల్ అమ్మకాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సియామ్ వ్యాఖ్యానించింది.
అసలు ఆటోమొబైల్స్కి వర్షాలకి సంబంధం ఏంటనుకుంటున్నారా..? వాస్తవానికి, భారత ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నవి మరియు ఆయా సంస్థలకు లాభాలను తెచ్చిపెడుతున్నవి బడ్జెట్లో అందుబాటులో ఉండే వాహనాలే. ఇలాంటి బడ్జెట్ ఉత్పత్తులకు ఎక్కువగా గ్రామీణ, పట్టణ మార్కెట్ల నుంచి మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కొనుగోలుదారుల్లో ఎక్కువ శాతం మంది నేలను నమ్ముకున్న రైతులు, భూస్వాములే ఉంటారు.
వర్షాలు సరిగ్గా కురవక పోయినట్లయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోమొబైల్స్ కొనాలనుకునే వారి ఆదాయం తగ్గిపోయి, వారు తమ స్వంత వాహన కలను నిజం చేసుకోలేరు. ఫలితంగా, ఆటోమొబైల్ అమ్మకాలు ఆశించిన రీజిలో వృద్ధి చెందలేవు. ఇదే విషయాన్ని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియాన్) డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ కూడా వెల్లడించారు.

వరుసగా రెండు నెలలుగా క్షీణిస్తూ వచ్చిన కార్ల అమ్మకాలు గడచిన మే 2014 నెలలో కాస్త పుంజుకున్నాయి. అలాగే వరుసగా ఎనిమిది నెలలుగా తగ్గుతూ వస్తున్న ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా మే నెలలో పెరిగాయి. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని, ఎంక్వైరీలు పెరుగుతున్నాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటున్నాయని ఆయన తెలిపారు.
గత నెల మే 2013లో దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ల కార్ల అమ్మకాలు 3.08 శాతం వృద్ధి చెంది 1,44,132 యూనిట్ల నుంచి 1,48,577 యూనిట్లకు పెరగగా, మోటార్సైకిళ్ల విక్రయాల 11.71 శాతం వృద్ధి చెంది 8,81,288 యూనిట్ల నుంచి 9,84,649 యూనిట్లకు పెరిగాయి. కాగా గత నెలలో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలను గమనిస్తే, అవి 16.3 శాతం వృద్ధి చెంది 12,06,173 యూనిట్ల నుంచి 14,02,830 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








