క్వాడ్రిసైకిల్స్ ప్రవేశంపై స్టే పొడగించిన కర్ణాటక హైకోర్ట్
దేశంలో 'క్వాడ్రిసైకిల్స్' (నాలుగు చక్రాలు కలిగిన ప్రయాణీకుల రవాణా వాహనాల) ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో వీటిని ప్రవేశపెట్టడంపై ఇటీవలే హైదరాబాద్ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసినదే.
కాగా.. తాజాగా కర్ణాటక రాష్ట్రం కూడా క్వాడ్రిసైకిల్స్ ప్రేవేశానికి వ్యతిరేకంగా ఉన్నట్ల కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కూడా క్వాడ్రిసైకిల్స్ ప్రవేశంపై విధించిన స్టేని మరికొంత కాలం పొడగిస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఇదివరకు విధించిన స్టే ఆగస్ట్ 25, 2014తో ముగియడంతో, తాజాగా మరోసారి స్టే విధించారు. ఈసారి స్టేని నవంబర్ 26, 2014వ తేదీ వరకూ పొడగించారు.

దేశవ్యాప్తంగా క్వాడ్రిసైకిల్స్పై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నడుస్తున్నాయి. గుజరాత్ హైకోర్ట్ (WP No.276 of 2014), మద్రాస్ హైకోర్ట్ (WP No. 7293 of 2014 and 27041 of 2014), ఢిల్లీ హైకోర్టు (WP No. 5994 of 2014)లు కూడా ఈ విషయంలో నోటీసులు జారీ చేశాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి పిటిషన్లను ఫైల్ చేయకపోవటం గమనార్హం.
భారత ప్రభుత్వం గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో క్వాడ్రిసైకిల్ విభాగానికి గుర్తింపునిచ్చి, వీటి విషయంలో కొత్త నిబంధనలు జారీ చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త రకం నాలుగు చక్రాల ఆటోరిక్షాల (క్వాడ్రిసైకిళ్లు)ను నగరంలో అనుమతిస్తే, తమ జీవనాధారం దెబ్బతింటుందని, అందుకే వీటిని నగరంలో అనుమతించడాన్ని నిషేధించాలని ఆటోరిక్షా యూనియన్ (మూడు చక్రాల ఆటోరిక్షాలకు చెందిన యూనియన్)లు డిమాండ్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








