టాటా నానో ప్లాంట్లో జాగ్వార్ కార్ల ఉత్పత్తి! నిజమేనా?
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ప్రజల కారు 'టాటా నానో' కొనుగోలుదారులను ఆకట్టుకోవటంలో విఫలమవుతున్న సంగతి తెలిసినదే. నానో అమ్మకాలు సజావుగా సాగకపోవటంతో, కేవలం ప్రత్యేకించి టాటా నానో ఉత్పత్తి కోసమే గుజరాత్లోని సనంద్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా తగ్గించి వేశారు.
ఎన్నో కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించి నిర్మించిన ఈ ఫ్యాక్టరీలోని సదుపాయాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవటంలో టాటా మోటార్స్ విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో, నానో ప్లాంటులో టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ 'జాగ్వార్' వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయటం ద్వారానైనా సనంద్ నానో ప్లాంట్ సార్థకమవుతుందని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే...
గుజరాత్ అసెంబ్లీలో అపోజిషన్ నేత శంకర్సిన్హ్ వాఘెలా టాటా మోటార్స్ సంస్థను ఏకిపారేశారు. నానో ఉత్పత్తి కోసం మాత్రమే గుజరాత్ సర్కారు టాటా మోటార్స్కు భూమిని, పలు ప్రయోజనాలను కల్పించిందని, వాస్తవానికి ఈ భూమిని తొలుత వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం కేటాయించాలనుకున్నారని, కానీ దీనిని టాటాకు కేటాయిస్తే, ఇప్పుడు ఆ ప్లాంటులో కంపెనీ నానో కారు ఉత్పత్తిని నిలిపివేసి జాగ్వార్ లగ్జరీ కార్లను తయారు చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.
సనంద్ ప్లాంట్లో టాటా తమ నానో టైర్లను కూడా ఉత్పత్తి చేయటం లేదని, దానికి బదులుగా జాగ్వార్ కార్లను తయారు చేస్తోందని కాబట్టి టాటా మోటార్స్కు కేటాయించిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ తక్షణమే ఆ రాష్ట్ర సర్కారు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications








