భారత మార్కెట్పై కన్నేసిన టెస్లా మోటార్స్, బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్
ప్రపంచంలో కెల్లా అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా మోటార్స్, ఇప్పుడు భారత మార్కెట్పై కన్నేసింది. భారత్ కోసం అత్యంత సరసమైన ధరకే ఓ ఎలక్ట్రిక్ సెడాన్ను తయారు చేసి, ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించాలని కంపెనీ యోచిస్తోంది.
టెస్లా మోడల్ 3 అనే కోడ్ నేమ్తో కంపెనీ ఓ బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. ఈ కారు ధర ప్రస్తుతం టెస్లా మోటార్స్ విక్రయిస్తున్న మోడల్ ధరలో సగం కన్నా తక్కువ ధర ఉండనున్నట్లు సమాచారం.

టెస్లా అభివృద్ధి చేస్తున్న థర్డ్ జనరేషన్ 4-డోర్ సెడాన్ 'మోడల్ 3' టార్గెట్ ధర 30,000 డాలర్ల నుంచి 40,000 డాలర్ల (సుమారు రూ.18-24 లక్షల) మధ్యలో ఉండొచ్చని టెస్లా మోటార్స్ ఛీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జే విజయన్ చెప్పారు.
ప్రస్తుతం టెస్లా మోటార్స్ విక్రయిస్తున్న మోడల్ ఎస్ ధర 1,00,000 డాలర్లకు (దాదాపు రూ.61 లక్షలకు) పైనే ఉంది. భారతదేశంలో గొప్ప అవకాశాలున్నాయని, కానీ ఈ మార్కెట్ కోసం సరసమైన ధరకే కార్లను ఆఫర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అమెరికా మార్కెట్లో ప్రతి ఎలక్ట్రిక్ కారుపై కనీసం 7500 డాలర్ల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, ఇండియాలో కూడా అదే మాదిరిగా ప్రభుత్వం సబ్సిడినీ అందించినట్లయితే, తమ కార్లను భారతీయ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురాగలమని ఆయన అన్నారు.

ప్రపంచంలో కెల్లా అత్యధిక దిగుమతి సుంకం విధించే దేశాల్లో ఇండియా కూడా ఒకటి, ఇక్కడ దిగుమతి సుంకం 100 శాతానికి పైగా ఉంటుందని, ఫలితంగా అమెరికాలోని ఫ్రీమోంట్లో ఉన్న తమ ప్లాంట్ నుంచి నేరుగా కానీ లేదా నెథర్లాండ్స్లోని అసెంబ్లీ యూనిట్ నుంచి కానీ కారును ఇండియాకు దిగుమతి చేసుకోవటం అసాధ్యం అవుతుందని విజయన్ తెలిపారు.
అందుకే, భారతదేశంలో ఓ స్థానిక అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయటం ద్వారా సరసమైన ధరకే ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను సపోర్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం నుంచి తమకు ఓ నిర్ధిష్టమైన పాలసీ కావాలని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








