ఆర్బిఐ వడ్డీ రేట్లు తగ్గించాల్సిన సమయం వచ్చింది: ఆనంద్ మహీంద్రా
దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతున్న తరుణంలో, ఈ వృద్ధిని మరింత పెంచాలంటే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా తెలిపారు.
రేట్ల తగ్గింపు గురించి ఆర్బిఐ ఆలోచించాల్సిన సమయం ఇదని ఇండియా ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ కేంద్రీయ బ్యాంక్ (ఆర్బిఐ)కు వడ్డీ రేట్లను తగ్గించడం సాధ్యం కాలేకపోయిందని మహీంద్రా అన్నారు.
అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయని, వృద్ధిని సపోర్ట్ చేయాలంటే వడ్డీ రేట్లను తగ్గించడం ఓ ఉత్తమమైన మార్గం అని మహీంద్రా అన్నారు. సెప్టెంబర్ నెలలో హోల్సేల్ ధరల సూచీ (డబ్ల్యూపిఐ) ఐదేళ్ల కనిష్టానికి తగ్గి 2.38 శాతంగా నమోదైంది.

మరోవైపు రీటైల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గి 6.46 శాతంగా నమోదైంది. జనవరి 2012లో కొత్త వినియోగదారుల ధరల సూచీ యొక్క కొత్త సిరీస్ని విడుదల చేసిన తర్వాత తక్కువగా నమోదు కావటం ఇదే మొదటిసారి.
నరేంద్ర మోడీ నాయకత్వంలోని సర్కారు తీసుకుంటున్న వివిధ చర్యల కారణంగా సెంటిమెంట్స్ మెరుగుపడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా గాడిన పడిందని, ప్రస్తుతం ఇది వృద్ధని కనబరుస్తోందని ఆయన అన్నారు. ఎక్సైజ్ సుంకాల తగ్గింపు కొనసాగింపుపై కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూనే, ఆటో పరిశ్రమలో పన్నులను మరింత తగ్గించాల్సిన సమయం ఇదని మహీంద్రా చెప్పారు.


Click it and Unblock the Notifications








